
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశాన్ని చంద్రబాబు ఈ లేఖలో ప్రస్తావించారు. తమిళనాడు పీడీఎస్ బియ్యాన్ని ఏపీ రైస్ మాఫియా తరలిస్తోందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను బియ్యం స్మగ్లింగ్ మాఫియా హరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు-చిత్తూరు సరిహద్దుల్లోని 7 మార్గాల ద్వారా రైస్ మాఫియా బియ్యం తరలిస్తోందని ఆరోపించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు తమిళనాడు-ఏపీ సరిహద్దులో నిఘాను పెంచాలని కోరారు.
వాణియంబాడి, తుంబేరి, పేర్ణంపట్టు మీదుగా చాలా వరకు రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుందని చెప్పారు. 16 నెలల్లో తన కుప్పం నియోజకవర్గంలో 13 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లో తగిన నిఘా లేకపోవడంతో రైస్ మాఫియా పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తోందని చంద్రబాబు తెలిపారు.
ఇక, తమిళనాడు నుంచి ఏపీకి పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా ఏ విధంగా తరలిస్తున్నారో స్టాలిన్కు చంద్రబాబు వివరించారు. ‘‘తమిళనాడు నుంచి ఏపీకి పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా అవుతాయి. అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని రైస్ మిల్లులకు పంపిస్తున్నారు. మిల్లర్లు బియ్యాన్ని పాలిష్ చేసి వారి స్మగ్లింగ్ భాగస్వాములకు తిరిగి పంపుతున్నారు. పాలిష్ చేసిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయించడం లేదా కర్ణాటకకు అక్రమంగా తరలించడం జరుగుతుంది’’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో గట్టి నిఘా పెట్టాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా.. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు, స్మగర్ల ఫొటోలను స్టాలిన్కు రాసిన లేఖకు జత చేశారు.