కోవిడ్ బారినపడినా టిడిపి అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు పార్టీ వ్యవహారాల్లో యధావిధిగా పాల్గొంటున్నారు. కరోనా కారణంగా క్వారంటైన్లో ఉన్న చంద్రబాబు ఆన్లైన్ ద్వారా పార్టీ కార్యక్రమాలపై బుధవారం నేతలతో రివ్యూ చేశారు. రాష్ట్రంలోని 8 నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జ్లతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
కోవిడ్ బారినపడినా టిడిపి అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు పార్టీ వ్యవహారాల్లో యధావిధిగా పాల్గొంటున్నారు. కరోనా కారణంగా క్వారంటైన్లో ఉన్న చంద్రబాబు ఆన్లైన్ ద్వారా పార్టీ కార్యక్రమాలపై బుధవారం నేతలతో రివ్యూ చేశారు. రాష్ట్రంలోని 8 నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జ్లతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాలలోని ఇంచార్జ్ లు, కోఆర్డినేటర్లతో విడివిడిగా మాట్లాడిన చంద్రబాబు.....ఆయా నియోజవర్గాల్లోని సంస్థాగత అంశాలతో పాటు పార్టీ పోరాటాలపై లోతుగా సమీక్ష జరిపారు. పనితీరు మెరుగు పరుచుకోవాలని పలువురు నేతలకు చంద్రబాబు సూచించారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంలో ఎక్కడా రాజీ పడొద్దని నేతలకు ఆయన తేల్చిచెప్పారు. చీపురుపల్లి, భీమిలి, రంపచోడవరం, నరసాపురం, గుంటూరు వెస్ట్, కోవూరు,బద్వేల్, మైదుకూరు నియోజకవర్గాలపై ఇంచార్జ్లతో చంద్రబాబు మంతనాలు జరిపారు. సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందుతున్న సేవలపైనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసిన చంద్రబాబు......వారికి దిశానిర్దేశం చేశారు. కోవిడ్ తీవ్రత నేపథ్యంలో రోగులకు ఆన్లైన్లో సేవలు అందించే ప్రక్రియను మరింత విస్తృత పరచాలని ఆయన సూచించారు. ఈ క్రమంలోనే రేపు మరికొన్ని నియోజకవర్గాల ఇంచార్జ్ లతో చంద్రబాబు నేరుగా మాట్లాడనున్నారు.
కాగా.. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కరోనా (Coronavirus) బారినపడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. కరోనా టెస్టులో తనకు పాజిటివ్(Positive) అని తేలిందని వివరించారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని ఆయన తెలిపారు. వెంటనే తాను హోం క్వారంటైన్లోకి వెళ్లినట్టు పేర్కొన్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, తనతో కాంటాక్టులోకి వచ్చిన వారూ వెంటనే కరోనా టెస్టు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
చంద్రబాబు కంటే ముందు ఆయన కుమారుడు లోకేష్కు కరోనా సోకింది. ఆయన కూడా ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా టెస్టులో తనకు పాజిటివ్ అని వచ్చినట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అయితే, తనకు కరోనా లక్షణాలు ఏవీ లేవని వివరించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలిపారు. ఈ మహమ్మారి నుంచి కోలుకునే వరకు హోం ఐసొలేషన్లో ఉండనున్నట్టు వెల్లడించారు. తనతో కాంటాక్టులోకి వచ్చిన వారంతా తప్పకుండా వీలైనంత తొందరగా కరోనా టెస్టు చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని సూచించారు. నారా లోకేష్ కరోనా బారిన పడ్డ తర్వాతి రోజే తండ్రి చంద్రబాబు నాయుడుకు కూడా ఈ వైరస్ పాజిటివ్ అని తేలింది.