
నంద్యాలలో దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం ఏపీలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా స్పందించారు. వైసీపీ పాలనలో బడుగుల హత్యలు పెరిగాయని.. నంద్యాలలో యువకుడి ఆత్మహత్య, ప్రభుత్వ హత్యేనని చంద్రబాబు ఆరోపించారు. వైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్గా మారిపోయిందని ఆయన ట్వీట్ చేశారు.
ఆయన ఏమన్నారంటే .. ‘‘ వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్ గా మారిపోయింది. వ్యవస్థలు చేస్తున్న హత్యలకు బడుగులు బలవుతున్నారు. దొంగతనం నేరం మోపి పోలీసులు వేధించడంతో నంద్యాలలో చిన్నబాబు అనే దళిత యువకుడు ప్రాణాలు తీసుకోవడం అత్యంత బాధాకరం. ఏ పోలీసులు అయితే వేధిస్తున్నారని 2020 నవంబర్ లో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందో...అదే పోలీస్ స్టేషన్ అధికారుల వేధింపుల కారణంగా, నేడు చిన్న బాబు రైలు కింద పడి ప్రాణాలు తీసుకోవడం విషాదకరం. రక్షణ ఇవ్వాల్సిన పోలీసుల వల్లనే ప్రాణాలు పోయే పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్లారు. నంద్యాల ఘటనలో బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి....బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేయాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
కాగా.. పోలీసుల వేధింపులు తాళలేక నంద్యాల జిల్లాకు చెందిన చినబాబు మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై బైక్ దొంగతనం నమోదు చేసిన పోలీసులు.. నేరాన్ని అంగీకరించాలని వేధించారని సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. రోజు తన్నులు తింటావా.. బైక్ తెచ్చిస్తావా అంటూ తనకు వార్నింగ్ ఇచ్చారని చినబాబు పేర్కొన్నాడు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకే తాను ఆత్యహత్య చేసుకుంటున్నట్లు మృతుడు తన మిత్రులకు సెల్ఫీ వీడియో పంపాడు.