
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సింహాచలం వరాహ నరసింహ స్వామి చందనోత్సవ కార్యక్రమం ఈరోజు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏడాదికి ఒకసారి నిజరూపంలో కనిపించే స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిషా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అయితే ఈ రోజు ఆలయంలో చేసిన సౌకర్యాలు వివాదాస్పదమయ్యాయి. స్వయంగా స్వరూపానందేంద్ర స్వామి కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు భారీగా తరలిరాగా.. సాధారణ ప్రజల కంటే వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ ఆలయ ఆధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పందించారు. సింహాచలం చందనోత్సవంలో భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులు బాధ కలిగించాయన్నారు. ప్రభుత నిర్లక్ష్యంగా కారణంగానే భక్తులు అవస్థలు పడ్డారని.. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో దశాబ్ధాలుగా లేని ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. దేవస్థానాలను వివాదాలకు కేంద్రంగా మారుస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALso Read: ఆచారాలను మంటగలిపారు: అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లపై స్వరూపానందేంద్ర ఫైర్
అంతకుముందు స్వరూపానందేంద్ర స్వామిజీ మాట్లాడుతూ.. సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరించారని ఆయన అధికారులపై మండిపడ్డారు. గుంపులుగా పోలీసులను పెట్టారని.. కానీ ఏర్పాట్లు సరిగా లేవన్నారు. తన జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హాజరయ్యానని చెప్పారు. ఎందుకు దర్శనానికి వచ్చానా అని బాధపడుతున్నానన్నారు. కొండ కింద నుండి పైవరకు రద్దీ ఉందని.. కానీ భక్తులకు జవాబు చెప్పేవారు లేరని స్వామిజీ అన్నారు. తన జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితిని చూడలేదని స్వరూపానందరేంద్ర చెప్పారు. భక్తుల ఆర్తనాదాలు వింటూంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు.