
హత్య రాజకీయాలను, ముఠా రాజకీయాలను అంతమొందించిన పార్టీ తెలుగుదేశం అన్నారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన పశ్చిమ గోదావరి (west godavari district) జిల్లా యలమంచిలిలో శుక్రవారం మాట్లాడుతూ.. ప్రజలకు అండగా టీడీపీ ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకుందామని.. పోరాడితే పోయేదేమి లేదన్నారు. తాను ఎక్కడికెళ్లినా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని చంద్రబాబు చెప్పారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. తెలంగాణలో వున్న ఏడు మండలాలను ఏపీకి కలిపేందుకు తీవ్రంగా ప్రయత్నించానని చంద్రబాబు గుర్తుచేశారు. ఆ ఏడు మండలాల ప్రజలకు వదర నష్టం కింద తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేలు, ఏపీ ప్రభుత్వం రూ.2 వేలు ఇస్తామని ప్రకటించిందన్నారు.
ALso REad:గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటన..
ప్రజలకు దగ్గరగా వుండాల్సిన సీఎం గాల్లో తిరుగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికలు వస్తుంటే మంత్రులను పంపుతారని.. వరదలు వస్తే ఎవరినీ పంపరంటూ ఆయన దుయ్యబట్టారు. త్వరలోనే ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తానని.. అప్పుల్లో శ్రీలంకను దాటిపోయామని, ఇలాగే కొనసాగితే రాష్ట్రం దివాలా తీస్తుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పేదవాడికి న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
ఇకపోతే.. గోదావరి వరదల్లో చిక్కుకున్న కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికే టీడీపీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు. సహాయక శిబిరాల్లో ఉన్న కుటుంబాలను వారి సొంత గ్రామాలకు తరలించడంలో, ప్రజలకు సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన వారికి చెప్పారు. ఇక, ఆకస్మిక వరదలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. వరద నీటిలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్ తాడేపల్లి ఇంట్లోనే ఉండిపోయారని విమర్శించారు. వరదల గురించి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.