తమ్మినేని సీతారాంకు బావమరిది పోటు

Published : Jan 06, 2019, 10:48 AM IST
తమ్మినేని సీతారాంకు బావమరిది పోటు

సారాంశం

ఆ ఇద్దరూ బావ బామ్మర్థులు. ఒకే పార్టీలోనే ఇద్దరి నేతల రాజకీయ ఆరంగేట్రం జరిగింది. బావ రాష్ట్రరాజకీయాల్లో కీలక స్థానంలో ఉంటే ఆయన అనుచరుడిగా బావమరిది రాజకీయాల్లో చక్రం తిప్పేవారు. బావ ఆదేశిస్తే దాన్ని ఆచరణలో పెట్టడం బావమరిది వంతు.   

శ్రీకాకుళం: ఆ ఇద్దరూ బావ బామ్మర్థులు. ఒకే పార్టీలోనే ఇద్దరి నేతల రాజకీయ ఆరంగేట్రం జరిగింది. బావ రాష్ట్రరాజకీయాల్లో కీలక స్థానంలో ఉంటే ఆయన అనుచరుడిగా బావమరిది రాజకీయాల్లో చక్రం తిప్పేవారు. బావ ఆదేశిస్తే దాన్ని ఆచరణలో పెట్టడం బావమరిది వంతు. 

బావ రాజకీయాల్లో చక్రం తిప్పుతుంటే బావపై చీమ వాళకుండా చూసుకునేవారు బావమరిది.  అయితే వీరి బంధాన్నిఓ పార్టీ తెంచేసింది. 2009లో బావ వేరే పార్టీలో చేరితే బావమరిది మాత్రం అదేపార్టీలో ఉండిపోయారు. 

ఆనాటి నుంచి బావపై యుద్ధానికి సై అంటున్నారు బావమరిది. ఆప్తులు కాస్త ఇప్పుడు బద్దశత్రువులుగా మారిపోయారు. బావమరిది అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే బావ ప్రతిపక్ష పార్టీ నేత. మళ్లీ రాబయే ఎన్నికల బరిలో కత్తులు దూసుకునేందుకు రెడీ అవుతున్నారు.ఇంతకీ ఆ బావ బావమరుదులు ఎవరు...వారిది ఏ పార్టీ...ఆప్తులను కాస్త శత్రువులుగా మార్చిన పార్టీ ఏది...ఇవన్నీ తెలియాలంటే శ్రీకాకుళం జిల్లా వెళ్లాల్సిందే. 

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేత తమ్మినేని సీతారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనకంటూ ఓ గుర్తింపు ఉంది. మంత్రిగా కూడా పనిచేశారు. తమ్మినేని సీతారం బావమరిది కూన రవికుమార్. బావచాటు బావమరిదిలా రాజకీయ ఆరంగేట్రం చేశారు. 

బావ మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉంటే జిల్లాలో ఈయన చక్రం తిప్పేవారు. 2009వరకు ఆముదాల వలస నియోజకవర్గ రాజకీయాలను, జిల్లా రాజకీయాలను ఓంటి చేత్తో నడుపుతున్న వారిలో అలజడి సృష్టించింది ప్రజారాజ్యం పార్టీ. 

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చెయ్యడంతో బావ తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. అయితే బావమరిది కూన రవికుమార్ మాత్రం సైకిల్ వీడలేదు. తమ్మినేని ప్రజారాజ్యం పార్టీలోకి చేరిపోవడంతో ఇక ఆముదాలవలస ఇంచార్జ్ గా కూన రవికుమార్ ను నియమించింది తెలుగుదేశం పార్టీ. 

ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తమ్మినేని సీతారాం మళ్లీ పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ ఆయనకు ఆముదాల వలస నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. 2014 ఎన్నికల్లో ఆముదాల వలస నియోజకవర్గం నుంచే బావ బావమరుదులు ఇద్దరూ పోటీకి దిగారు.

ఎన్నికల సమరంలో ఇద్దరు నేతలు కత్తులు దూసుకున్నారు. ఒకప్పటి ఆప్తులు కాస్త ప్రత్యర్థులుగా మారిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. నువ్వా నేనా అన్న రేంజ్ లో పోటీపడ్డారు. అయితే ఆ ఎన్నికల్లో అదృష్టం బావమరిది కూన రవికుమార్ ను వరించింది. ఆ తర్వాత ఆయన ప్రభుత్వ విప్ గా కూడా ఎంపికయ్యారు. 

బావ మాత్రం ప్రతిపక్ష పార్టీలోనే ఉంటున్నారు. అయితే 2019 ఎన్నికల సమరంలో మళ్లీ ఆముదాలవలస నియోజకవర్గం నుంచి బావ బావమరుదులు తలపడే అవకాశం ఉండటంతో శ్రీకాకుళంలో ఈ బావ బావమరుదలు పొలిటికల్ ఫైట్ ఆసక్తిచూపుతోంది. 

ఇప్పటికే బావ బావమరుదులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో విప్ కూన రవికుమార్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని తమ్మినేని సీతారం ఆరోపిస్తుంటే మంత్రిగా ఉన్నప్పుడు బావ చేసిన అవినీతి అక్రమాల చిట్టా తన దగ్గర ఉందంటూ ఆయన సమాధానం ఇస్తున్నారు. 

బావ చిట్టా విప్పుతా అంటూ భయపెడుతన్నారు. గత ఎన్నికల్లో తన దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్న కూన రవికుమార్ చేతిలో ఓడిపోవడంతో ఈ ఎన్నికల్లో అయినా ఖచ్చితంగా గెలవాలని తమ్మినేని సీతారాం ప్రయత్నిస్తున్నారట. 

తాను లేకపోతే తమ్మినేని సీతారాం ఎక్కడ ఉండేవాడంటూ విరుచుకుపడుతున్నారు. అక్కభర్తవి కాబట్టి బయటకు చెప్పలేకపోతున్నా లేకపోతేనా వేరేలా ఉండేదంటూ హెచ్చరిస్తున్నారు కూన.

ఇప్పటికే ఆముదాలవలస నియోజకవర్గం అభ్యర్థిగా కూన  రవికుమార్ తిరిగి పోటీ చేయనున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ్మినేని సీతారాం అభ్యర్థిత్వాన్ని ఇంకా ప్రకటించలేదు. అలా అని ఆయన్ను కాకుండా మరోకరికి టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ లేదు. 

ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల పోరులో బావ బావమరుదల పోటీ ఆసక్తిగా మారిందది. ఇప్పటికే ఓటమితో రగిలిపోతున్న బావ గెలుస్తారా...లేక మళ్లీ బావమరిది కూన రవికుమార్ గెలిచి బావకు షాక్ ఇస్తారా అన్నది వేచి చూడాలి. 
 

PREV
click me!

Recommended Stories

భార్యతో కలిసి రోడ్డు పక్కన తాటి ముంజలు తిన్న చంద్రబాబు | Chandrababu | Ice Apples
అక్క VS తమ్ముడు | Byreddy Siddarth Reddy Counter To Byreddy Shabari | Asianet News Telugu