
అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారంనాడు వార్నింగ్ ఇచ్చారు. ఫోర్జరీ దొంగలు జేసీ బ్రదర్స్ ను ఎందుకు లోకేష్ సమర్ధిస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. తాపడిత్రిలో లోకేష్ జాగ్రత్తగా మాట్లాడకపోతే తాను ఊరుకోనన్నారు. తనను రెచ్చగొడితే దేనికైనా సిద్దమేనన్నారు. తనపై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తే లోకేష్ వద్దే తేల్చుకుంటానని ఆయన తేల్చి చెప్పారు. జేసీ బ్రదర్స్ అరాచకాలపై తన వద్ద ఆధారాలున్నాయని ఆయన తెలిపారు.
also read:ఆలూరు వెళ్లకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డగింత: తాడిపత్రిలో ఉద్రిక్తత
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది. అనంతపురం జిల్లాలోని శింగనమల అసెంబ్లీ నియోజకవర్గంలోని జంబులదిన్నె సైట్ నుండి ఆదివారంనాడు లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. త్వరలోనే తాడిపత్రి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర ప్రవేశించనుంది. ఇటీవలనే ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడని లోకేష్ ఆరోపించారు. ఎర్రగుట్టను ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఆక్రమించుకున్నారని లోకేష్ ఆరోపించారు.
ముదిగుబ్బలో రూ. 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని కూడా ఆరోపణలు చేశారు. లోకేష్ ఆరోపణలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఖండించారు. తనపై బురదచల్లేందుకు లోకేష్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు.
ధర్మవరంలో తరహలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే తాను సహించబోనని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తేల్చి చెప్పారు.