అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ చాలేంజ్ విధానం అంతా బోగాసేనా...? ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మాటలు చూస్తే అలాగే అనిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా సింగపూర్ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని, ఇదే విషయం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాసినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అమరావతి నగర నిర్మాణానికి స్విస్ చాలెంజ్ విధానం సరైనది కాదని తెలిపారు ఐవైఆర్ కృష్ణారావు. స్విస్ చాలెంజ్ విధానంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. స్విస్ చాలెంజ్ విధి విధానాలను వక్రీకరించి తారుమారు చేసి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. కొన్ని కంపెనీలను దొడ్డిదారిన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే సింగపూర్ కంపెనీల విషయంలో అన్ని సమగ్రంగా పాటించారా..? అనే సందేహాం కల్గుతుందన్నారు.
భారత్లోని నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు సింగపూర్ అడ్డగా మారిందని ఓ అంతర్జాతీయ పత్రిక కథనమే ఇందుకు ఆధారమని ఐవైఆర్ అన్నారు. శారదా స్కాం డబ్బు సింగపూర్ చేరిందని, ఇండోనేషియా, చైనాల నుంచి వచ్చిన డబ్బు మొత్తం సింగపూర్కు తరలి వెళ్లిందని పలు అంతర్జాతీయ పత్రికలు, ఎన్జీవోలు పేర్కొన్నాయని ఆయన తెలిపారు.
దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఆరోపణలు ఉన్న సింగపూర్తో రాజధాని నిర్మాణాన్ని చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే సింగపూర్ కంపెనీలతో రాష్ట్రం చేసుకున్న ఒప్పందాలను తెగదెంపులు చేసుకోవాలని లేఖలో కోరానని ఐవైఆర్ పెర్కొన్నారు. ఈ విషయాలపై తాను ప్రధాన కార్యదర్శిగా ఉన్నపుడు మాట్లాడకూడదు కాబట్టి అప్పట్లో తాను మాట్లాడలేదన్నారు..సింగపూర్ కన్షార్షియంకు నిర్మాణ పనులను కట్టబెట్టేందుకే చంద్రబాబు కోర్టు పరిశీలనకు కూడా అధిగమించేలా చట్టంలో మార్పులు చేసినట్లు ఐవైఆర్ మండిపడ్డారు.
మరిన్ని తాజా వివరాల కోసం కింద క్లిక్ చేయండి