గుంటూరులో టీడీపీ ఆఫీస్ నిర్మణంపై ఆర్కే పిటిషన్ : విచారణ జరపాలని హైకోర్టుకు సుప్రీం ఆదేశం

By narsimha lodeFirst Published Apr 15, 2021, 3:28 PM IST
Highlights

గుంటూరు జిల్లాలో టీడీపీ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి  భూ కేటాయింపులో  అక్రమాలకు పాల్పడ్డారని  వైసీపీకి చెందిన  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరపాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది.

న్యూఢిల్లీ: గుంటూరు జిల్లాలో టీడీపీ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి  భూ కేటాయింపులో  అక్రమాలకు పాల్పడ్డారని  వైసీపీకి చెందిన  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరపాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది.ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్న సమయంలో  గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యాలయ నిర్మాణం జరిగింది.

2017లో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ కార్యాలయ నిర్మాణం కోసం  నిబంధనలను ఉల్లంఘించారని  వైసీపీ ఆరోపించింది.  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  2019లో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  పార్టీ కార్యాలయం నిర్మాణం జరిగిన రెండేళ్ల తర్వాత పిటిషన్ దాఖలు చేయడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మరో వైపు ఈ విషయమై  ప్రభుత్వం కూడ స్పందించకపోవడంతో పిటిషన్ ను కొట్టివేసింది.

దీంతో సుప్రీంకోర్టులో ఇదే విషయమై  ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ పై  సుప్రీంకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది. జస్టిస్ నారీమన్ నేతృత్వంలోని  త్రిసభ్య  ధర్మాసనం విచారణ నిర్వహించింది.నీటి వనరులకు అడ్డంగా టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారని  ఆర్కే తరపు న్యాయవాది వాదించారు.  అయితే నీటి వనరులకు అడ్డంగా కార్యాలయ నిర్మాణం జరగలేదని టీడీపీ తరపు న్యాయవాది  తెలిపారు.  వాగులు, వంకల ద్వారా నీరు వెళ్లిపోయేందుకు వీలుగా  భూమిని  వదిలివేసినట్టుగా  టీడీపీ న్యాయవాది తెలిపారు.

ఈ పిటిషన్ లో మెరిట్ ఆధారంగా  పిటిషన్ ను విచారించాలని ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.  నాలుగు మాసాల్లో విచారణను పూర్తి చేయాలని కూడ హైకోర్టుకు సుప్రీం సూచించింది. 
 

click me!