ఆర్- 5 జోన్ అంశంపై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని వారు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
ఆర్- 5 జోన్ అంశంపై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అమరావతి రైతులు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు. రైతుల పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టాలని వారి తరపు న్యాయవాదులు సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజెఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావనకు తీసుకువచ్చారు. అయితే ఆ పిటిషన్ను వచ్చేవారం విచారించనున్నట్టుగా సీజేఐ ధర్మాసనం తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి తేదీని ధర్మాసనం ఖరారు చేయలేదు.
ఇదిలా ఉంటే.. రాజధాని అమరావతిలో బయట ప్రాంతాలకు చెందిన భూమిలేని పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్టే విధించాలని కోరుతూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు భూ బదలాయింపు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 45, దాని ప్రకారం చేసే ఇళ్ల స్థలాల కేటాయింపు తాము ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉండాలని హైకోర్టు తెలిపింది. రాజధానిపై హైకోర్టు ఇచ్చిన ఫుల్ బెంచ్ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించకపోవడంతో మధ్యంతర స్టే ఇవ్వడం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది