ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అవకతవకల ఆరోణలకు సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై నమోదు చేసిన కేసులో నారాయణకు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. వివరాలు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చడం ద్వారా రైతులకు అన్యాయంగా నష్టం కలిగించారని, ఇతరులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చారని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారాయణ తదితరులపై సీఐడీ కేసు నమోదు చేసింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి నారాయణతో సహా పలువురు నిందితులు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఇందుకు సంబంధించి నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ నాగరత్నలతో కూడా ధర్మాసనం పిటిషన్ను విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ..ఇన్నర్ రింగ్ రోడ్డు అన్లైన్మెంట్, భూ సేకరణలో నారాయణ మార్పులు చేశారని తెలిపారు. నారాయణ విచారణకు సహకరించడం లేదని చెప్పారు.
ఈ క్రమంలోనే స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ప్రతీకార రాజకీయాల్లోకి కోర్టులను లాగొద్దని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. నిందితులు విచారణకు సహకరించకపోతే సీఐడీ బెయిల్ రద్దు పిటిషన్ వేసుకోవాలని సూచించింది.