
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వివేకా కుమార్తె సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిల విచారణ ముగిసింది. ఈ సందర్భంగా మూడు గంటల పాటు వారి నుంచి కీలక వివరాలను తెలుసుకున్నారు సీబీఐ అధికారులు. వారి స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో వివేకా రెండో భార్య షమీమ్ చేసిన ఆరోపణలతో పాటు వివేకా రాసిన లేఖ గురించి వీరిద్దరిని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. లేఖను సాయంత్రం వరకు ఎందుకు గోప్యంగా వుంచారని ప్రశ్నించినట్లుగా సమాచారం.
మరోవైపు.. వివేకానందరెడ్డి హత్య కేసులో అఫ్రూవర్ గా మారిన దస్తగిరి ఇంటికి మంగళవారంనాడు సీబీఐ అధికారులు చేరుకున్నారు. దస్తగిరి ఇంటి వద్ద భద్రతను సీబీఐ అధికారులు పరిశీలించారు. దస్తగిరితో సీబీఐ అధికారులు మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కీలక దశ చేరుకున్నందున జాగ్రత్తగా ఉండాలని సీబీఐ అధికారులు దస్తగిరికి సూచించారు. ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా తమకు తెలపాలని సీబీఐ అధికారులు దస్తగిరికి చెప్పారు.
అంతకుముందు వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన స్వగ్రామం పులివెందులకు చేరుకున్నారు. వైఎస్ వివేకాందరెడ్డి కేసులో ఆయన అభియోగాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డిని గడిచిన కొద్దిరోజులుగా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వివేకా కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
Also Read: వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ : విచారణ రేపటికి వాయిదా
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ నెల 16వ తేదీన అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ నెల 17న తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల 17, 18 తేదీల్లో తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. ముందస్తు బెయిల్ పై మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నెల 25వ తేదీన ఈ విషయమై తుది తీర్పును ఇవ్వనున్నట్టుగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సవాల్ చేశారు. ఈ మేరకు ఈ నెల 20న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై ఈనెల 21న సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై స్టే ఇచ్చింది. ఈ నెల 24 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారించింది. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. మరో వైపు ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో అరెస్ట్ చేయవద్దని వైఎస్ అవినాష్ రెడ్డి తరపు లాయర్ల వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.