సుజనా అడ్డుగోలు సమర్ధింపు

First Published Jan 28, 2017, 7:40 AM IST
Highlights

ప్రత్యేకహోదాపై యువత చేసిన ఉద్యమంతో తనను తాను సమర్ధించుకునేందుకు నానా అవస్తలు పడుతున్నారు.

ప్రత్యేకహోదా విషయంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు. ఇవ్వాల్సిందంతా కేంద్రం ఇచ్చేసిందని, ఇక ఇంతకుమించి అడగలేమంటూ వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదాపై యువత చేసిన ఉద్యమంతో తనను తాను సమర్ధించుకునేందుకు నానా అవస్తలు పడుతున్నారు. మొదట తాము కూడా ప్రత్యేకహోదానే అడిగామన్నారు. అయితే, 14వ ఆర్ధిక సంఘం, రఘురామరాజన్ కమిటి సిఫారసులను తెలుసుకున్నాక హోదా ఇవ్వటం సాధ్యం కాదని తెలిసిందంటున్నారు. ప్రత్యేకహోదా విషయంలో తాము ఎటువంటి సిఫారసు చేయలేదని 14వ ఆర్ధిక సంఘానికి ఛైర్మన్ గా పనిచేసిన వైవి రడ్డి స్పష్టంగా చెప్పారు. ప్రత్యేకహోదా ఇవ్వటమన్నది రాజకీయ కారణాలతో ముడిపడిన అంశంగా రెడ్డి చెప్పిన విషయం సుజనా మరచిపోయారేమో.

 

ప్రత్యేకహోదా ఇవ్వకపోవటం వల్ల కలిగే నష్టాన్ని విదేశీరుణాలు ఇప్పించటం ద్వారా భర్తీ చేసేందుకు కేంద్రం అంగీకరించదని చెప్పారు. మరి ఇప్పటి వరకూ ఏ మేరకు విదేశీ రుణాలు వచ్చాయో చౌదరే చెప్పాలి. వెనుకబడిన ప్రాంతాలభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం రూ. 24 వేల కోట్లతో ప్రతిపాదనలు పంపితే ఇప్పటికి వచ్చింది కేవలం రూ. 700 కోట్లే. ఇక పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా కేంద్రం వందశాతం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదనే కొత్త విషయాన్ని సుజనా చెప్పారు. ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించి ఉంటే అందుకు అయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుంది కదా? వీళ్ల ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించలేదన్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వలేకపోయినందుకు పోలవరానికయ్యే వందశాతం వ్యయాన్ని కేంద్రమే భరిస్తోందంటూ జనాల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు.

 

పనిలో పనిగా బ్యాంకులకు ఎగ్గొట్టిన రుణాలపైనా మంత్రి స్పందించారండోయ్. 30 ఏళ్ళుగా తాను కంపెనీలు పెట్టి వ్యాపారాలు చేస్తున్నట్లు చెప్పారు. బ్యాంకుల వద్ద అప్పులు తీసుకున్నామేగానీ ఏనాడు రుణాలను ఎగ్గొట్టలేదన్నారు. మరి, మారిషస్ బ్యాంకు తనపై కేసు ఎందుకు వేసింది? కోర్టు ఎందుకు నాన్ బైలబుల్ అరెస్టు వారెంటో ఇచ్చినట్లో? అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన వారి జాబితాను బ్యాకు యూనియన్లు ప్రకటించాయి లేండి. అందులో సుజనా పేరు ఉండటం నిజం కాదా? 2009లోనే కోటి రూపాయలు వ్యయం చేసి పత్రికల్లో తన కంపెనీ లెక్కలను వెల్లడించినట్లు కామిడి చేసారు. పత్రికల్లో వెల్లడించేదంతా నిజమనుకోవటానికి జనాలేమన్నా పిచ్చోళ్లా?

click me!