అనంతబాబు బంధువుల నుంచి బెదిరింపులు: కాకినాడ పోలీసులను ఆశ్రయించిన సుబ్రహ్మణ్యం బాబాయి

By Sumanth KanukulaFirst Published Jul 6, 2022, 1:31 PM IST
Highlights

ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అనంతబాబు బంధువు బెదిరింపులకు పాల్పడుతున్నారని  సుబ్రహ్మణ్యం బాబాయ్ శ్రీను ఆరోపించారు.

ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. అయితే తాజాగా అనంతబాబు బంధువు బెదిరింపులకు పాల్పడుతున్నారని  సుబ్రహ్మణ్యం బాబాయ్ శ్రీను ఆరోపించారు. ఈ మేరకు కాకినాడ టూటౌన్ పోలీసు స్టేషన్‌లో సుబ్రహ్మణ్యం బాబాయ్ శ్రీను ఫిర్యాదు చేశారు. ఇక, శ్రీనుకు మద్దతుగా దళిత సంఘాలు నిలిచాయి. శ్రీను కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశాయి. 

మరోవైపు అనంతబాబు రిమాండ్‌ను ఇటీవల రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు మరో 14 రోజులు పొడిగించిన సంగతి తెలిసిందే. గతంలో ఆయనకు విధించిన రిమాండ్ శుక్రవారంతో పూర్తి అయ్యింది. దీంతో, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు శుక్రవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ మేరకు విచారణ జరిపిన తరువాత ఈ నెల 15 వరకు న్యాయమూర్తి అనంత బాబుకు రిమాండ్ను పొడిగించారు.

మరోవైపు అనంతబాబు మరోసారి రాజమహేంద్రవరం ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతనెల 17న అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి అనంతబాబు తరుపు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను జమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ నెల 11కు వాయిదా వేసింది. ఇక, సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23 నుంచి అనంతబాబు  రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉంటున్న సంగతి తెలిసిందే.  
 

click me!