మచిలీపట్నంలో ఓ వింత దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను స్మశానంలో ఉంటూ.. అక్కడే రెక్కీ చేసి దొంగతనాలకు పాల్పడతాడు. ఆ తరువాత దొంగిలించిన సొత్తును స్మశానంలోనే పాతిపెడతాడు.
మచిలీపట్నం : స్మశానాలే అతడి నివాసం. అక్కడే ఉంటూ రెక్కీ నిర్వహించి ఎంచుకున్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడతాడు. దోచుకున్న సొమ్మును స్మశాన వాటికలో పాతిపెట్టి దాచేస్తాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహాలో దాదాపు 121 చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర నేరస్తుడిని చల్లపల్లి, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణాజిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ జాషువా వివరాలు వెల్లడించారు. చాట్రాయి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన తిరువీధుల సురేంద్ర అలియాస్ సూర్య అనాథ. చోరీలను వృత్తిగా చేసుకున్నాడు.
తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనాలు చేస్తాడు. ఇతని పై ప్రస్తుత ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలీస్ స్టేషన్ లో డీసీ షీట్ ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాలాచోట్ల చేతివాటం ప్రదర్శించాడు. గత నెల 28న చల్లపల్లి ఇస్లాంనగర్ లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సూర్యను అదుపులోకి తీసుకుని విచారించగా.. మరికొన్ని నేరాలకు సంబంధించి వివరాలు వెలుగు చూశాయి. ఒక కేసులో సూర్యను పీడీ యాక్ట్ పై తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వరంగల్ జైలులో శిక్ష అనుభవించాడు. గత నెల 17న విడుదల అయిన తరువాత 20 రోజుల వ్యవధిలో చల్లపల్లి తోపాటు గుడివాడ, జంగారెడ్డిగూడెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, రాజానగరం, ఖమ్మంలో దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది .
ముగిసిన బీఏసీ మీటింగ్: ఈ నెల 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
గమ్మత్తయిన మనిషి..
స్మశాన వాటికలో ఉంటూ చోరీ చేసే ఇళ్లను ఎంచుకుంటాడు. మద్యం తాగడం, నిద్ర తదితరాలన్నీ అక్కడి సమాధులపైనే కొనసాగిస్తాడు. సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎప్పుడూ ఉపయోగించాడు. చేతికి గ్లౌస్ ధరించి సీసీ కెమెరాల కనెక్షన్లను తొలగిస్తాడు. చోరీ తర్వాత సొత్తును స్మశానంలో పాతిపెట్టి అవసరం వచ్చేవరకు భద్రపరుస్తాడు. ఖమ్మం జైలు నుంచి విడుదలయ్యాక చేసిన ఏడు చోరీలలో దొంగిలించిన రూ.20 లక్షల విలువ చేసే బంగారు నగలు, వెండి ఆభరణాలు, బైక్, నగదులను ప్రత్యేక బృందాలు స్మశానవాటికలో నుంచే రికవరీ చేశారు.