కరోనా ఎఫెక్ట్: గుజరాత్ నుండి బస్సుల్లో ఏపీకి 5 వేల మంది మత్స్యకారులు

By narsimha lodeFirst Published Apr 28, 2020, 5:47 PM IST
Highlights

గుజరాత్ రాష్ట్రంలోని వేరావల్ లో చిక్కుకొన్న ఏపీ రాష్ట్రానికి చెందిన ఐదువేల మత్స్యకారులను స్వంత రాష్ట్రానికి మంగళవారం నాడు బయలుదేరనున్నారు..

అమరావతి: గుజరాత్ రాష్ట్రంలోని వేరావల్ లో చిక్కుకొన్న ఏపీ రాష్ట్రానికి చెందిన ఐదువేల మత్స్యకారులను స్వంత రాష్ట్రానికి మంగళవారం నాడు బయలుదేరనున్నారు.. సముద్రమార్గం ద్వారా కాకుండా  బస్సుల్లో వీరిని ఏపీకి తరలిస్తున్నారు. సముద్రమార్గం ద్వారా వీరిని ఏపీకి తరలించాలని గుజరాత్ సీఎంను  జగన్ కోరారు. అయితే సముద్ర మార్గం ద్వారా కాకుండా బస్సుల్లో తరలించేందుకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

గుజరాత్ రాష్ట్రంలోని వేరావల్ గ్రామంలో ఏపీ రాష్ట్రంలోని  ఐదువేల మత్స్యకారులు చిక్కుకొన్నారు.గత ఏడాది ఆగష్టు మాసంలో వీరంతా గుజరాత్ రాష్ట్రానికి వలస వెళ్లారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసం వరకు వారంతా సముద్ర జలాల్లోనే చేపల వేట కొనసాగిస్తారు. ఎనిమిది నెలల పాటు వీరంతా సముద్రంలోనే గడుపుతారు. నెలలో కనీసం 25 రోజుల పాటు వారంతా సముద్రంలోనే ఉంటారు. ఆ తర్వాతే వారు ఒడ్డుకు చేరుకొంటారు.

గత 25 రోజుల నుండి వారంతా సముద్రంలో చేపల వేటకు వెళ్లలేదు. దీంతో బోటు యజమానులు వారికి జీతాలు ఇవ్వలేదు. దుర్భర జీవితం గడుపుతున్నట్టుగా మత్స్యకారులు తమ కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా చెప్పారు. ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. 

also read:లాక్‌డౌన్ దెబ్బ:గుజరాత్‌లో చిక్కుకొన్న శ్రీకాకుళం మత్స్యకారుడు మృతి

దీంతో వేరావల్ గ్రామంలో చిక్కుకొన్న మత్స్యకారుల విషయమై గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో ఏపీ సీఎం జగన్ ఈ నెల 21వ తేదీన ఆ తర్వాత మరోసారి మాట్లాడారు. వేరావల్ గ్రామంలో భోజనం, వసతి కల్పించాలని గుజరాత్ సీఎంను కోరారు. ఆ తర్వాత రెండు రోజులకే మత్స్యకారుడు మృతి చెందడంతో సముద్రమార్గం ద్వారా మత్స్యకారులను ఏపీకి పంపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 

సముద్ర మార్గం ద్వారా కాకుండా రోడ్డు మార్గంలో ఏపీకి పంపేందుకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మంగళవారం నాడు సాయంత్రం సుమారు 76 బస్సుల్లో మత్స్యకారులు ఏపీకి బయలుదేరనున్నారు.
 

click me!