ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా వైఎస్సార్ సన్నిహితుడు

By telugu teamFirst Published Nov 8, 2019, 1:28 PM IST
Highlights

వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన జర్నలిస్టు శ్రీనాథ్ దేవిరెడ్డిని వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించింది. జర్నలిజంలో ఆయనకు విశేషమైన అనుభవం ఉంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్టు శ్రీనాథ్ దేవిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిజంలో శ్రీనాథ్ దేవిరెడ్డికి ఆపారమైన అనుభవం ఉంది. 

శ్రీనాథ్ దేవిరెడ్డి కడప జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామానికి చెందినవారు. ఆంధ్రప్రభ దినపత్రిక ద్వారా 1978లో ఆయన జర్నలిజం వృత్తిలో ప్రవేశించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అందులో కొనసాగారు. కడప జిల్లాలో పనిచేసినప్పుడు ఆయన రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై సెవెన్ రోడ్స్ జంక్షన్ పేరుతో కాలమ్ రాశారు. 

ఆయన 1990 దశకంలో బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఏపీయుడబ్ల్యుజె) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 ఏళ్లు పనిచేశారు. ఆ తర్వాత ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు.

తనను ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించినందుకు శ్రీనాథ్ దేవిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాలనే జగన్ ఆశయ సాధన దిశగా పనిచేస్తానని చెప్పారు. 

click me!