కన్నతండ్రిని కత్తులతో నరికి చంపిన కొడుకులు

First Published Jun 26, 2018, 4:36 PM IST
Highlights

మద్యానికి బానిసై తల్లిని కొడుతున్నాడని...

కర్నూల్ జిల్లా డోన్ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసై నిత్యం తల్లిని కొడుతున్నాడని కన్న తండ్రిని ముగ్గురు కొడుకులు కలిసి కత్తులతో నరికి చంపారు.  ఈ హత్య నిన్న అర్థరాత్రి నడి రోడ్డుపై జరిగింది.

వివరాల్లోకి వెళితే... డోన్ పట్టణంలోని చిగురుమాను పేట ప్రాంతానికి చెందిన కృపానందం (45) ఫుల్లుగా మద్యం తాగి వచ్చి నిత్యం భార్యను వేధించేవాడు. అలాగే ఇతడికి పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉండేవి. రోజురోజుకూ తండ్రి ప్రవర్తన సృతిమించడంతో విసిగిపోయిన ముగ్గురు కొడుకులు ఇతడి పీడ శాశ్వతంగా తొలగించుకోవాలని బావించారు.

నిన్న సాయంత్రం ఇంటికి వెళ్లిన కృపానందం మరోసారి భార్యతో గొడవకు దిగి ఆమెను చితబాది వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసిన కోపోద్రిక్తులైన కొడుకులు చిన్నకాంతు, పెద్దకాంతు, నాగన్న లు తండ్రిని పట్టణంలోని అమ్మా హోటల్‌ వద్ద పట్టుకుని కత్తులతో దాడి చేశారు.దీంతో కృపానందంకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మృతుడు కృపానందం చనిపోయేముందు ఇచ్చిన వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు డోన్ పోలీసులు తెలిపారు.
 

click me!