రాయలసీమ, కడప ప్రాంత ప్రజలపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు శోఛనీయమని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వెంటనే రాయలసీమ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సినిమా వాళ్లే తమ లాభాల కోసం రాయలసీమ సంస్కృతిని దిగజార్చారని అన్నారు.
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu virraju) ఓ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి (gadikota srikanth reddy) అన్నారు. ఆయన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. కడప ప్రజలు మనుషులను చంపుతారని. వారికి ఎయిర్ పోర్టు అవసరమా ఆయన మాట్లాడటం శోఛనీయమని అన్నారు. వెంటనే సోము వీర్రాజు తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సినిమా వాళ్లు తమ లాభం రావడానికి కడప ప్రాంతాన్ని, అక్కడి సంస్కృతిని దిగజార్చారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయలసీమ ప్రజలను ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరించారని తెలిపారు. ఆ ప్రాంతంలో కూడా బీజేపీ జెండా పట్టుకుని తిరిగే వారున్నారని తెలిపారు. సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలపై సిగ్గుపడాలని అన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫ్ఐఆర్ (FIR)లు నమోదు అవుతూన్నాయో సోము వీర్రాజు చూడాలని తెలిపారు. వెంటనే ఆయన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాయలసీమ సంస్కృతిని సినిమాల్లోనే కించపరిచేలా చూపించారని అన్నారు. టీడీపీ (tdp) తన పబ్బం గడుపుకోవడానికి ఫ్యాక్షన్ గొడవలు రేపిందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. మద్దెల చెరువు సూరికి కూడా ఎమ్మెల్యే టికెట్ నిరాకరించిన ఘటన వైఎస్ కు ఉందని అన్నారు. టీడీపీ పెట్టె వ్యూహాత్మక సమావేశాలకు కుట్ర మీటింగ్ లని పేరు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.
ఏం జరిగిందంటే.. ?
ఏపీ ప్రభుత్వం 26 కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని, అలాగే జిల్లాకు ఓ ఎయిర్ పోర్టు (air port) ను నిర్మించాలని ఇటీవలే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రోడ్లే సరిగా లేవని, ఇప్పుడు ఎయిర్ పోర్టులు అవసరమా అని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై రెండున్నర ఏళ్లు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రతి జిల్లాకు ఒక కమిటీ ఏర్పాటు చేసి అభిప్రాయాన్ని సేకరించాలని ఆయన కోరారు.చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలే తమ పార్టీ విధానమని సోము వీర్రాజు చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గం వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని తాము గతంలోనే చెప్పామన్నారు. జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మాటల సందర్భంలో రాయలసీమలో ఎయిర్ పోర్టు, కడప (kadapa)లో ఎయిర్ పోర్టులు అవసరమా అని అన్నారు. వారికి ప్రాణాలు తీసుకోవడమే వచ్చని ఆయన నోరుజారారు.
సోము వీర్రాజు వ్యాఖ్యలు ఆయనను వివాదంలోకి నెట్టేశాయి. రాయలసీమ ప్రాంతం గురించి చేసిన ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియా (social media)లో విపరీతంగా వైరల్ అయ్యాయి. రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజల నుంచి, వివిధ పార్టీల నాయకుల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన వివరణ ఇవ్వాల్సి వచ్చింది. వైఎస్ వివేకా (ys viveka) హత్యను దృష్టిలో వుంచుకునే తాను అలా మాట్లాడానని ఆయన చెప్పారు. కడప ప్రజలకు. హత్యా రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.