అగ్రిగోల్డ్ కేసు మళ్ళీ మొదటకి వచ్చింది. అగ్రిగోల్డ్ కేసులో ఇరుకున్న వేలాది మంది కస్టమర్లు నానా ఇబ్బందులు పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా వేలాదిమంది కస్టమర్లున్న అగ్రిగోల్డ్ కేసు గతంలో ఓ సంచలనం రేపింది.
ఎవరో కస్టమర్ కేసు పెట్టారన్న కారణంతో ప్రభుత్వం కాస్త అత్యుత్సాహం చూపి నెలల వ్యవధిలోనే ఏకంగా సంస్ధనే మూసేసింది. అంతేకాకుండా సంస్ధ ప్రమోటర్లలో అందరినీ అరెస్టులు చేసి కేసులు నమోదు కూడా చేసి రిమాండ్ కు పంపింది.
కేసును ఎలా డీల్ చేయాలో అర్ధంకాక ప్రభుత్వం అవస్తలు పడుతున్న నేపధ్యంలో జీ గ్రూపు హటాత్తుగా తెరపైకి వచ్చింది. సంస్ధకు చెందిన ఆస్తులు, అప్పులను తాము తీసుకుని కస్టమర్ల వ్యవహారాలను తామే సెటిల్ చేస్తామంటూ చంద్రబాబునాయుడుకు హామీ ఇచ్చింది.
దాంతో చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించటంతో జీ గ్రూపు యాక్టివ్ అయ్యింది.
అయితే, ఇంతలో ఏమైందో ఏమో సంస్ధకు అప్పులు రూ. 10 వేల కోట్లుండగా, ఆస్తులు మాత్రం రూ. 2500 కోట్లు మాత్రమే ఉందని జీ గ్రూపు కోర్టులో పేర్కొంది. సంస్ధ వ్యవహారాలను సెటిల్ చేయటానికి తామొక్కరి వల్లే సాధ్యం కాదని సమాజ్ వాది పార్టీకి చెందిన ఓ కీలక నేతను కూడా తాము కలుపుకోవాలని అనుకుంటున్నట్లు కోర్టులో గ్రూపు చెప్పింది.
అందుకు కోర్టు నిరాకరించింది. సొంతంగానే సంస్ధ వ్యవహారాలు సెటిల్ చేసే ఉద్దేశ్యముంటేనే తమకు రెండు వారాల్లో చెప్పాలంటూ ఆదేశించింది. దాంతో అగ్రిగోల్డ్ కేసు నుండి జీగ్రూపు దాదాపు పక్కకు తప్పుకున్నట్లైంది.
ఇదిలా వుండగా సంస్ధ ఆస్తులను విషయమై టిడిపిలోని అనేకమంది నేతల ప్రమేయంపై వైసిపి అసెంబ్లీలోనే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.