చంద్రబాబుకు షాక్: వైసీపీలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు, వారు వీరే...

By telugu teamFirst Published Dec 4, 2019, 7:21 AM IST
Highlights

ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం వైఎస్ జగన్ ను కలిసే అవకాశం ఉంది.

ఒంగోలు: మరో ముగ్గురు టీడీపీ శాసనసభ్యులు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ బాటలో నడిచేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఆ ముగ్గురు కూడా ప్రకాశం జిల్లాకు చెందినవారు కావడం విశేషం. 

టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు మంగళవారంనాడు విజయవాడలోని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి నివాసంలో సమావేశమైనట్లు తెలుస్తోంది. వారు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది. 

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మాట్లాడారు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో ఆరుగురిని దూరం చేస్తే టీడీపీ ప్రతిపక్ష హోదా గల్లంతవుతుంది. ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు. వారిలో ముగ్గురిని తమ పార్టీలోకి లాగేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది.

చీరాల నుంచి కరణం బలరాం, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, పరుచూరు నుంచి ఏలూరి సాంబశివరావు, కొండపి నుంచి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గెలిచారు. వీరిలో ముగ్గురు వైసీపీకి వెళ్లే అవకాశం ఉంది. వారిలో ముగ్గురుని వైసీపీలోకి తెచ్చేందుకు మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ప్రయత్నాలు చేస్తున్నారు .

click me!