శరన్నవరాత్రి ఉత్సవాల వేళ.. ఇంద్రకీలాద్రిపై అపచారం..తాగి, ఊగుతూ...

By SumaBala BukkaFirst Published Sep 29, 2022, 8:45 AM IST
Highlights

శరన్నవరాత్రి ఉత్సవాల వేళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపచారం చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్ అక్కడే తాగి, ఊగుతూ కనిపించాడు. 

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై అపచారం జరిగింది. పవిత్రంగా శ్రద్ధాసక్తులతో విధులు నిర్వర్తించాల్సిన కాంట్రాక్టు సంస్థ ఉద్యోగి మత్తులో జోగాడు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులను క్రమపద్ధతిలో నడిపించడానికి వివిధ ప్రదేశాల్లో భద్రతా విధులకు ఎజైల్ సెక్యూరిటీ ఏజెన్సీ.. సెక్యూరిటీ కాంట్రాక్టు తీసుకుంది. మహా మండపం, ఇంద్ర కీలాద్రి, ముఖ ద్వారం, ప్రధాన ఆలయం లోపల,  బయట, రాజగోపురం, లిఫ్టుల ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేవారికి సెక్యూరిటీ ఆఫీసర్ (ఎస్ వో)గా చంద్ర అనే వ్యక్తి వ్యవహరిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు కావడంతో ఈఓ భ్రమరాంబ పాదమెట్ల మార్గం వద్ద ఉన్న కార్యాలయంలో ఉంటున్నారు.

చంద్ర బుధవారం ఈవో వద్దకు వచ్చి ఊగుతూ కనిపించాడు.  ఆయన మాట్లాడుతుంటే మద్యం వాసన రావడాన్ని గుర్తించిన ఈవో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడి గుర్తింపు కార్డును తీసుకుని విషయాన్ని కాంట్రాక్టు సంస్థకు తెలియజేశాడు. వెంటనే అతడిని విధుల నుంచి పంపేశారు. ఈ ఘటనతో కాంట్రాక్టు సంస్థపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రను దుర్గగుడి దగ్గర నుంచి తప్పించి కొత్త వ్యక్తిని నియమిస్తామని ఏజన్సీ ప్రతినిధులు దుర్గగుడి అధికారులకు తెలిపారు. చంద్ర మహామండపంలోని నాలుగో అంతస్తులో విధుల్లో ఉన్నాడు. అక్కడే మద్యం తాగాడనేప్రచారం జరుగుతోంది. 

ఇదిలా ఉండగా, విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.  అయితే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంద్రకీలాద్రిపై బుధవారం ఉదయం ఆలయం స్థానాచార్య, ప్రధాన అర్చకులను పోలీసులు అడ్డుకున్నారు. లిఫ్ట్ ద్వారా అనుమతించకుండా తాళాలు వేశారు. డ్యూటీపాస్ లు చూపినప్పటికీ పోలీసులు వారితో దురుసుగా ప్రవర్తించారు. మీకు నచ్చింది చేసుకో అంటూ మాట్లాడారు.

ఇంద్రకీలాద్రిపై పోలీసుల అత్యుత్సాహం.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అర్చకులు..

పోలీసుల తీరుపై అర్చకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ పేర్లుతో పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ఇలా తమను అడ్డుకుంటే ఎలా విధులు నిర్వర్తించాలని అర్చకులు అంటున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు ఆదేశానుసారమే తాము పనిచేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

అర్చకులతో పోలీసుల వివాదంపై జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు స్పందించారు. ఆలయ ఈవో, ఉత్సవ ప్రత్యేక అధికారి, పోలీసులు,  వైదిక కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.  అనుమతి ఉన్నవారిని, పాసులు ఉన్నవారిని లోనికి అనుమతించాలని  కలెక్టర్ సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు నుంచే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

 

click me!