ఎక్కువ వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయాలను మోసం చేసిన ఘటన అనంతపురంలో చోటు చేసుకొంది. బాధితులు ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
అనంతపురం: ఎక్కువ వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయాలను మోసం చేసిన ఘటన అనంతపురంలో చోటు చేసుకొంది. బాధితులు ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ. 30 వేలు వడ్డీ చెల్లిస్తానని ఈబీఐడీడీ ఫైనాన్స్ సర్వీస్ పేరుతో కొందరు ప్రజల నుండి డిపాజిట్లు సేకరించారు.
డిపాజిట్ల సేకరణకు గాను ఏజంట్లను కూడ నియమించుకొన్నారు. డిపాజిట్ల సేకరణలో కొందరు పోలీసులు కూడ పాల్గొన్నారని బాధితులు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు వంద మందికి పైగా బాధితులు అనంతపురం ఎస్పీని బుధవారం నాడు కలిసి ఫిర్యాదు చేశారు.
ఎక్కువ వడ్డీ వస్తోందనే ఆశతో కొందరు అప్పులు చేసి మరీ కూడ డబ్బులు కట్టారు. ఇలా డబ్బులు కట్టిన వారికి తొలుత నమ్మకం కల్గించేలా వడ్డీని అందించారు. ఆ తర్వాత కాలంలో వడ్డీ చెల్లించలేదు. సుమారు 100 మంది నుండి రూ. 300 కోట్లు వసూలు చేసినట్టుగా బాధితులు ఆరోపిస్తున్నారు.
రెండు మూడు నెలలుగా తమకు వడ్డీలు చెల్లించడం లేదని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డబ్బులు వసూలు చేసిన ఏజంట్ల ఫోన్ నెంబర్లు పనిచేయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు వసూలు చేసినవారు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారని బాధితులు ఎస్పీకి తెలిపారు.ఈ విషయమై బాబుల్ రెడ్డి అనే వ్యక్తి ధర్మవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.