ఆ గ్రామం...జగన్ కు చాలా ప్రత్యేకం

First Published Jan 30, 2018, 6:50 AM IST
Highlights
  • సైదాపురం...ఈ ఊరు ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.

సైదాపురం...ఈ ఊరు ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. వైసిపికి సంబంధించి సైదాపురంతో విడదీయరాని బంధమేర్పడింది. గత కొద్ది రోజులుగా మారుమోగిపోతున్న పేరు సైదాపురం.  ఆ ఊరుకు ఎందుకంత క్రేజ్ వచ్చిందో అందరకీ తెలిసిందే.

74వ రోజు సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటింది సైదాపురంలోనే. అందుకే ఆ ఊరంటే వైసిపికి అంతటి ప్రత్యేక అభిమానం.

అదేవిధంగా చరిత్రలో అందరికీ చిరపరిచితమైన ఊర్లు ఇంకొన్ని కూడా ఉన్నాయి. అవి చేవెళ్ళ, ఇచ్చాపురం. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళంటే దివంగత వైఎస్సార్ కు అపారమైన ప్రేమ. అందుకే తన పాదయాత్రను వైఎస్ చేవెళ్ళ నుండే మొదలుపెట్టారు. అలాగే ఇచ్చాపురం కూడా.

అప్పట్లో వైఎస్ అయినా, ఇపుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా పాదయాత్రను ముగించటానికి నిర్ణయించుకున్న ఊరు ఇచ్ఛాపురమే. ఆ ఊరు శ్రీకాకుళం జిల్లాలో ఉంది. మామూలుగా అయితే ఆ ఊర్ల చుట్టుపక్కలున్న వారికి మాత్రమే తెలిసిన ఊర్లు. కానీ వైఎస్ కుటుంబం పుణ్యమా అని చేవెళ్ళ, ఇచ్ఛాపురంతో పాటు ప్రస్తుతం సైదాపురం కూడా వార్తల్లో ఊర్లైపోయాయి.

సరే, ప్రస్తుతానికి వస్తే సైదాపురంకు వైసిపికి విడదీయరాని బంధం ఏర్పడింది. మొదలుపెట్టింది సొంత ఊరైన ఇడుపులపాయే అయినా మొదటి మైలురాయి అంటే వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయమంటే మామూలు విషయం కాదు. అందుకే తమ ఊరిలోనే మొదటి మైలురాయిని దాటిన జగన్ అంటే ఊరి ప్రజలకు కూడా ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది.

అందుకే జగన్ తమ ఊరికి ఎప్పుడెపుడు వస్తారా, వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేస్తారా అని ఊరి జనాలందరూ ఎదురుచూశారు. చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ఊరి ప్రజలు సుమారు 25 అడుగుల స్ధూపాన్ని ఏర్పాటు చేసి దాన్ని జగన్ తోనే ఆవిష్కరింపచేశారు. అందుకే సోషల్ మీడియాలో సైదాపురం పేరు మారుమోగిపోతోంది.

click me!