
అమరావతి: రష్యా (russia) దాడులతో భయానక పరిస్థితులు నెలకొన్న ఉక్రెయిన్ (ukraine) లో చిక్కుకున్న తెలుగువారిని యోగక్షేమాలను తెలుసుకునేందుకు ఏపీ సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఉన్నతచదువుల కోసం ఉక్రెయిన్ కు వెళ్ళిన ఏపీ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ శాఖను ఓవైపు కోరుతూనే మరోవైపు ఎప్పటికప్పుడు తెలుగువారి సమస్యల గురించి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటుచేసింది.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులకు సంబంధించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఏపీ సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. ఆరుగురు సీనియర్ అధికారులతో ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటయినట్లు తెలిపారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులు 1902 కంట్రోల్ రూంకి ఫోన్ చేసి సమస్యలను తెలపాలని సీఎస్ సూచించారు. అలాగే 48660460814, 4860670015 నంబర్లకు కూడా సంప్రదించవచ్చని.... వాట్సాఫ్ ద్వారా 8500027678 నెంబర్ కు కూడా సమస్యల గురించి సంప్రదించవచ్చని ప్రకటించారు.
ఏపీ రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఏ.బాబు తదితర ఉన్నతాధికారులు ఈ కంట్రోల్ రూమ్ బాధ్యతలు వహిస్తారని సీఎస్ వెల్లడించారు. 1902 ద్వారా తల్లిదండ్రులు వారి పిల్లలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని సీఎస్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ సరిహద్దుల్లోని పోలాండ్ కు భారతీయులను చేర్చి అక్కడినుండి విమానంలో ఇండియాకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. అలాగే మరో సరిహద్దు నుంచి కూడా విద్యార్థులను తరలించేందుకు విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిందన్నారు. ముందుగా రోడ్డుమార్గంలో ఉక్రెయిన్ సరిహద్దు దాటించి... ఆ తర్వాత విమానాల ద్వారా ఢిల్లీకి అక్కడి నుంచి ఏపీకి తరలిస్తామన్నారు.
ఏపీ, తెలంగాణ నుంచి ఉక్రెయిన్ లో 1000 మంది విద్యార్థులు ఉంటారన్నారు. ఇప్పటివరకు కాల్ సెంటర్లకు 130కి పైగా కాల్స్ వచ్చినట్లు తెలిపారు. తల్లిదండ్రులు అక్కడ ఉన్న విద్యార్థులు కు సంబంధించిన సమాచారాన్ని కంట్రోల్ రూమ్ అధికారులకు అందించాలని సీఎస్ సమీర్ శర్మ కోరారు.
ఇక మాజీ ఉక్రెయిన్ రాయబారి గితేష్ శర్మ మాట్లాడుతూ... ఉక్రెయిన్ భూ సరిహద్దులు దాటించి మన వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అక్కడ చిక్కుకున్న విద్యార్థులతో నిరంతరం మాట్లాడుతున్నామని... అందరిని సురక్షితంగా ఇక్కడికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉక్రెయిన్ లోని ఆ దేశ ఎంబసితో పాటు భారత ఎంబసితోను మాట్లాడుతున్నామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గితేష్ ధైర్యం చెప్పారు.
కంట్రోల్ రూం అధికారి ఏ.బాబు మాట్లాడుతూ... ఉక్రెయిన్ ఎంబసీతో పాటు అక్కడ ఉన్న యూనివర్సిటీల ద్వారా విద్యార్ధుల లొకేషన్స్ ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న నాలుగు చోట్ల నుంచి విద్యార్ధులను వెనక్కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. హంగేరి, పోలాండ్, స్లోవేకియా, రోమెనియా సరిహద్దు ప్రాంతాల్లో కేంద్రం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ల ద్వారా విద్యార్ధులను స్వదేశానికి తరలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం తమవద్ద 170 మంది విద్యార్ధుల వివరాలు మాత్రమే ఉన్నాయని ఏ.బాబు తెలిపారు.