Guntur Bus Accident: బాపట్ల కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టిసి బస్సు... ఐదుగురికి గాయాలు (Video)

By Arun Kumar PFirst Published Dec 16, 2021, 9:55 AM IST
Highlights

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బస్సు ప్రమాదాన్ని మరిచిపోకముందే గుంటూరు జిల్లాలో మరో ఆర్టిసి బస్సు ప్రమాదానికి గురయ్యింది. అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కన కాలువలోకి దూసుకెళ్లింది. 

గుంటూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో పదిమందిని బలితీసుకున్న ప్రమాదాన్ని మరిచిపోకముందే గుంటూరు జిల్లాలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. guntur district లోని కాకుమాను మండలం అప్పాపురం వద్ద ఆర్టిసి బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయాలయ్యాయి. 

వివరాల్లోకి వెళితే...  గుంటూరు జిల్లాలోని కాకుమాను నుండి బాపట్ల (bapatla)కు ప్రయాణికులతో వెళుతున్న ఆర్టిసి బస్సు (rtc bus) ఒక్కసారిగా అదుపుతప్పింది. గుంతలమయంగా వున్న రహదారిపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై వున్న గుంతను తప్పించే క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న బాపట్ల-నందిపాడు కాల్వలోకి దూసుకెళ్లిందని ప్రయాణికులు చెబుతున్నారు. 

Video

బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు కాలువలోకి పూర్తిగా దూసుకెళ్లి పడిపోకుండా డ్రైవర్ కంట్రోల్ చేసారు. ఈ క్రమంలో డ్రైవర్ కు చేయి విరిగినట్లు సమాచారం. అలాగే ప్రమాదంలో మరో ఐదుగురు ప్రయాణికులు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఎక్కువగా విద్యార్థులే వున్నారు. 

read more  Bus Accident In Prakasam : ఏపీలో మ‌రో పెను ప్ర‌మాదం .. అప్ర‌మ‌త్తంతో త‌ప్పిన ముప్పు

రోడ్డు ప్రమాదం (appapuram bus accident)పై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే క్రతగాత్రులను అంబులెన్స్ లో బాపట్ల హాస్పిటల్ కు తరలించి చికిత్స అందేలా చూసారు. అనంతరం బస్ యాక్సిడెంట్ పై దర్యాప్తు ప్రారంభించారు. 

ఇదిలావుంటే నిన్న పశ్చిమగోదావరి (west godavari bus accident) జిల్లా జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టిసి బస్సు బుధవారం మారణహోమం సృష్టించింది. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెంకు దాదాపు 43 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు జల్లేరు వద్ద ప్రమాదానికి గురయ్యింది. జల్లేరు వాగుపై గల వంతెనపై ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి బస్సు అదుపుతప్పింది. దీంతో బస్సు అమాంతం వంతెనపైనుండి వాగులోకి పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా పదిమంది మరణించారు.  

బస్సు వంతెనపై నుండి అమాంతం వాగులోకి పడిపోవడంతో గాయాలపాలై కొందరు మృతిచెందితే వాగులో మునిగి ఊపిరాడక మరికొందరు చనిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి వాగులోకి దిగి ప్రయాణికులను కాపాడారు. పడవల సాయంతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు.  దీంతో చాలామంది సురక్షితంగా బయటపడ్డారు.  

read more  West Godavari Bus Accident : బస్సు పర్ఫెక్ట్.. మానవ తప్పిదమే వల్లే ప్రమాదం : అధికారులు

తీవ్ర గాయాలపాలైన ప్రయాణికులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇలా చికిత్స పొందుతున్నవారిలో కొందరి పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది. ఇప్పటివరకు పదిమంది మృతిచెందగా పదుల సంఖ్యలో గాయపడినవారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో అత్యధికులు మహిళలే వున్నారు.  

 జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ఘటనపై సీఎం జగన్‌ (ys jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలిపిన సీఎం బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. 

ఈ బస్సు ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోడీ కూడా స్పందించారు.  ఈ ఘటన బాధ కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ప్రధాని కార్యాలయం పరిహారం ప్రకటించింది.  

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (chandrababu naidu) కూడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న టిడిపి (TDP) శ్రేణులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే బాధిత కుటుంబాలకు టిడిపి అండగా వుంటుందని చంద్రబాబు తెలిపారు.

click me!