రజనీకాంత్‌‌ జీరో అయ్యాడు.. ఆయన వ్యాఖ్యలపై ప్రకటన విడుదల చేయాల్సిందే..: మంత్రి రోజా

Published : May 01, 2023, 03:06 PM ISTUpdated : May 01, 2023, 03:09 PM IST
రజనీకాంత్‌‌ జీరో అయ్యాడు.. ఆయన వ్యాఖ్యలపై ప్రకటన విడుదల చేయాల్సిందే..: మంత్రి రోజా

సారాంశం

సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మరోసారి ఫైర్ అయ్యారు. రజనీకాంత్‌పై ఎన్టీఆర్ అభిమానులు కోపంతో ఉన్నారని చెప్పుకొచ్చారు.

సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మరోసారి ఫైర్ అయ్యారు. రజనీకాంత్‌పై ఎన్టీఆర్ అభిమానులు కోపంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. తిరుకంచి గంగై వరదరాజు నాధీశ్వర ఆలయంలో పుష్కరణి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రోజా పుదుచ్చేరి వెళ్లారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. రజనీకాంత్ తన వ్యాఖ్యలతో జీరో అయ్యారని విమర్శించారు. ఇన్నాళ్లూ సంపాదించిన పేరు పోగొట్టుకున్నాడని అన్నారు. రాజకీయాలు వద్దనుకున్న రజనీకాంత్ మళ్లీ రాజకీయాలు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. 

ఎన్టీఆర్ గొప్ప నటుడని.. ఆయనను ప్రజలు దేవుడిలా చూసేవారని చెప్పారు. కృష్ణుడిని చూడాలంటే ఎన్టీఆర్‌లో చూశారని తెలిపారు. అయితే రజనీకాంత్‌కు చంద్రబాబు ఎలా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడించింది, పార్టీని లాక్కుంది అనే విషయాలు తెలుసునని అన్నారు. అప్పుడు చంద్రబాబుకు రజనీకాంత్‌ మద్దతుగా ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయని అన్నారు. రజనీకాంత్ వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులను బాధించాయని అన్నారు.

‘‘తెలుగు ప్రజలు రజనీకాంత్‌ను సూపర్‌స్టార్‌గా భావించారు. అయితే ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పోడిచిన చంద్రబాబు నాయుడుని పొగుడుతూ రజనీకాంత్ ప్రసంగం తర్వాత..  ఇటు ప్రజలు, ఎన్టీఆర్ సానుభూతిపరులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు వాటిపై ఎందుకు వ్యాఖ్యానించారు?. రజనీకాంత్‌ను మనం పెద్ద స్థాయిలో ఊహించుకునేవాళ్లం.. కానీ ఇప్పుడు ఆయన జీరో అయిపోయారు’’ అన  రోజా అన్నారు. మరో రాష్ట్రానికి వెళ్లే కళాకారులు రాష్ట్ర రాజకీయాల గురించి వ్యాఖ్యానించే ముందు అక్కడి పరిస్థితులు తెలుసుకోవాలని కోరారు. 

‘‘నేను రజనీకాంత్‌ను క్షమాపణ అడగాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి రావడం లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ను ఎక్కువగా సందర్శించడం లేదు. తెలిసో తెలియకో మాట్లాడాడు కాబట్టి తన ప్రయోజనాల కోసం దీనిపై ప్రకటన విడుదల చేయాలి’’ అని మంత్రి రోజా అన్నారు.

ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. సినిమా రంగంలోనూ, రాజకీయంలోనూ రాణించారని గుర్తుచేసుకున్నారు. అదే విధంగా వేదికపై ఉన్న చంద్రబాబు నాయుడుపైన కూడా రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. 

అయితే రజనీకాంత్ ప్రసంగంపై మంత్రలు రోజా, అంబటిరాంబాబు, మాజీ మంత్రి కొడాలి నాని తదితరులు విమర్శలు గుప్పించారు. రజనీకాంత్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వైసీపీ మద్దతుదారులు.. రజనీకాంత్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు, రజనీకాంత్ అభిమానులు ధీటుగా స్పందిస్తున్నారు. 

ఏపీలో అధికార వైసీపీపై రజనీకాంత్ ఎలాంటి విమర్శలు చేయలేదని వారు అంటున్నారు. ఆయన చంద్రబాబు విజన్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని.. అదే వేదికపై ఎన్టీఆర్ గురించి కూడా చాలా  గొప్పగా మాట్లాడారని గుర్తుచేస్తున్నారు. #YSRCPApologizeRAJINI వంటి ట్యాగ్‌లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు  వైసీపీ నేతలు మాత్రం తెలుగుదేశం పార్టీ, రజనీకాంత్ టార్గెట్‌గా విమర్శలు కురిపిస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Pemmasani Chandrasekhar:పోస్టల్ డెలివరీలను 24గంటల్లో పూర్తిచేయడమే దీని లక్ష్యం | Asianet News Telugu
Nara Lokesh Speech: మంగళగిరి మయూరీ టెక్ పార్క్‌లో APEDB కార్యాలయం ప్రారంభం | Asianet News Telugu