దైవదర్శనానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి

By Arun Kumar PFirst Published Apr 5, 2019, 1:48 PM IST
Highlights

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుండి తిరుపతికి దైవదర్శనం కోసం వెళుతున్న భార్యాభర్తలతో పాటు మరో ఇద్దరు ఈ ప్రమాదంలో మృతిచెందారు. 
 

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుండి తిరుపతికి దైవదర్శనం కోసం వెళుతున్న భార్యాభర్తలతో పాటు మరో ఇద్దరు ఈ ప్రమాదంలో మృతిచెందారు. 

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లాకు చెందిన వెంకటకృష్ణ పరమహంస, సూర్యకాంతం భార్యాభర్తలు. సమీప బంధువయిన చంద్రమౌళి అనే మరో వ్యక్తితో కలిసి వీరు గురువారం రాత్రి కారులో తిరుపతికి బయలుదేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రకాశం జిల్లా గుడ్లూరు వద్ద ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న కారు రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ సంతోష్ తో పాటు మిగతా ముగ్గురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకుతీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దైవదర్శనం కోసం వెళ్లిన తమవారు ఇలా ప్రమాదానికి గురై మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 
 

click me!