
నీళ్లో ...నీళ్లో... నీళ్లు... రాయలసీమోళ్లదంతా ఒకటే గోల. ఇక ఈ అరుపులు మానేయవచ్చు. నీళ్ల బాధ తప్పిపోయే మార్గం కనబడుతూ ఉంది.
మిసైల్స్ వస్తున్నాయి. సంతోషించండి. రాయలసీమ ఇండియాలోనే నెంబర్ వన్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రం అవుతూ ఉందట. మీ భూములల్లో మాంచిగా ఇండస్ట్రీ వస్తా ఉంటే, ఇక నీళ్లడగడం మానుకోవాలి. మిసైల్స్ అందుకోండి. డిఫెన్స్ పరిశ్రమలు, మిసైల్ టెస్టింగ్ సెంటర్, డిఫెన్స్ హబ్.... ఇంకా నీళ్ల గోల ఏమిటి?
అనంతపురము, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఏరోస్పేస్, డిఫెన్స్ పార్కుల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తున్నదని ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పింది.
‘ఈ రెండు రంగాలలో అత్యాధునిక సాంకేతిక పరిశోధన, హార్డ్ వేర్ లతో మాన్యుఫాక్చరింగ్ సెంటర్లతో ముడిపెడుతూ వినూత్న ఆవిష్కరణల వేదికగా (రాయలసీమను) మలచడానికి ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో వున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గారి కార్యాయలం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని ఒక బృందం ‘ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే అంశంపై మంగళవారం బెంగళూరులో జరిగిన గ్లోబల్ సీఈవోల కాంక్లేవ్లో పాల్గొని రాష్ట్రంలో ఈ రంగంలో గల అవకాశాలను వివరించింది.
భారత్లో ఇజ్రాయెల్ రాయబారి డేనియల్ కార్మొన్ ఆంధ్రప్రదేశ్ మీద ఎనలేని ఉత్సాహం చూపించారట.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, ఏపీ ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిశోర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకంగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకు గల అవకాశాలపై ఈ బృందం ఒక ప్రెజెంటేషన్ ఇచ్చింది.
కర్నూలు జిల్లా వోర్వకల్లులో డీఆర్ డీవో మిస్సయిల్ టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. రానున్న కాలంలో అనంతపురము ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్గా మారనున్నదని తెలిపింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో బీఈఎల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ రానున్నదని, పాల సముద్రంలో వైటల్ ఇన్నోవేషన్ సిటీ, గుడిపల్లిలో భారత్ ఫోర్జ్ మల్టీ మోడల్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయబోతున్నాయని బృందం పేర్కొంది.