
దక్షిణ బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. ఇది తీవ్ర వాయుగుండగా ( deep Depression) మారి ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతోంది. గడిచిని 6 గంటలుగా గంటకు 13 కి.మీ వేగంతో తీవ్ర వాయుగుండం తీరం వైపు కదులుతుంది. గంటకు 13 కి.మీ వేగంతో ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తుంది. ప్రస్తుతం తమిళనాడులోని నాగపట్నానికి ఆగ్నేయంగా 320 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది దిశ మార్చుకుని ఉత్తర తమిళనాడు వైపు రానుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇక, తీవ్ర వాయుగుండం శనివారం సాయంత్రం తమిళనాడు తీరానికి మరింత దగ్గరగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తమిళనాడు, కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.