కారులో మృతదేహం: కోగంటి సత్యం అనుచరుడు శ్యామ్ ను విచారించిన పోలీసులు

By telugu teamFirst Published Aug 21, 2021, 12:43 PM IST
Highlights

పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో పోలీసులు కోగంటి సత్యం అనుచరుడు శ్యామ్ ను విచారించారు. రాహుల్ హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని శ్యామ్ మీడియాతో చెప్పారు.

విజయవాడ: పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసులో పోలీసులు కోగంటి సత్యం అనుచరుడు శ్యామ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రాంప్రసాద్ హత్య కేసులో కోగంటి సత్యంతో పాటు గతంలో శ్యామ్ కూడా అరెస్టయ్యాడు. శ్యామ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తాను కోగంటి సత్యం వద్ద పనిచేసిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. రాహుల్ హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పారు. తాను హత్య చేస్తే విజయవాడలో ఎందుకుంటానని అన్నారు. పోలీసులు తనను పిలిచి విచారించారని చెప్పారు. 

రాహుల్ విజయవాడలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అతని మృతదేహం కారులో పడి ఉంది. ఆ మృతదేహాన్ని రాహుల్ దిగా గుర్తించిన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో కోరాడ విజయ్ కుమార్ ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రాహుల్ కు, విజయ్ కుమార్ కు మధ్య వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పలుసార్లు పంచాయతీ కూడా జరిగిందని చెబుతున్నారు. ఈ వివాదం కారణంగానే విజయ్ కుమార్ రాహుల్ హత్యకు ప్రణాళిక రచించి అమలు చేసినట్లు తెలుస్తోంది.

రాహుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు గాయత్రి, పద్మశ్రీ అనే ఇద్దరు మహిళలపై కూడా కేసు నమోదు చేశారు. రాహుల్ హత్య చిక్కుముడిని విప్పేందుకు పోలీసులు పలువురిని విచారిస్తున్నారు. రాహుల్ హత్యతో తనకు సంబంధం లేదని కోగంటి సత్యం ఇప్పటికే స్పష్టం చేశారు. 

click me!