
ఢిల్లీ : జనసేన అధినేత Pawan Kalyanకు నరసాపురం ఎంపీ Raghuramakrishnan Raju ధన్యవాదాలు తెలిపారు. తనకు అండగా నిలబడినందుకు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ‘ఏపీ సిఐడి పోలీసులు నాపై చేసిన క్రూరమైన దాడిని మీరు ఖండించినందుకు పవన్ కళ్యాణ్ గారు మీకు నా ధన్యవాదాలు. సీతారామరాజు విగ్రహావిష్కరణకు మీకు ఆహ్వానం ఉన్నప్పటికీ, నా సొంత నియోజకవర్గానికి, విగ్రహావిష్కరణకు నన్ను రాష్ట్ర ప్రభుత్వం రానివ్వకుండా అడ్డుకున్నందుకు నిరసనగా.. అంత గొప్ప కార్యక్రమానికి మీరు హాజరు కాకపోవడం.. మీలాంటి ధైర్యం ఉన్న నాయకులకు మాత్రమే సాధ్యమయింది. మీ ధైర్యానికి నా హ్యాట్సాఫ్’ అంటూ కితాబునిచ్చారు.
జనసేనాని పవన్ కల్యాణ్ భీమవరంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగిన అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదో క్లారిటీ ఇచ్చారు. ప్రధాని సభకు నాకు ఆహ్వానం అందింది. కానీ, రావడం కుదరలేదు అని అన్నారు. అలాగే అదే సమయంలో స్థానిక ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆహ్వానం అందకపోవడంతో.. తాను వెళ్లడం సరికాదనే ఉద్దేశంతోనే కార్యక్రమానికి దూరంగా ఉన్నానని అన్నారు. రఘురామను నిర్ధాక్షణ్యంగా అరికాళ్లపై కొట్టించి అడుగు వేయలేకుండా చేశారని.. ఏ పార్టీలో ఉన్నా విధానాలు బాగాలేనప్పుడు విమర్శలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.
వరదల్ని రాజకీయాలకు వాడతారా : పవన్పై మంత్రి దాడిశెట్టి రాజా విమర్శలు
రఘురామ సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి అన్నారు. ఇది రఘురామకృష్ణంరాజుపై చేసిన దాడిగా చూడడం లేదని... వైఎస్సార్సీపీ క్షత్రియులందరి మీద చేసిన దాడిగా తాను చూస్తున్నానని వ్యాఖ్యానించారు. రామకృష్ణంరాజు తనకు వ్యతిరేకంగా పోటీ చేశారని... ఆయన తమ కులం కాదు అన్నారు. కానీ, సాటి మనిషి అని, ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని అన్నారు. తాను ఇక్కడే ఉన్నాను అని.. ఎక్కడికీ పారిపో లేదని.. ఇక్కడే అందరికీ అండగా ఉంటానని చెప్పడం కోసమే భీమవరం వచ్చానని అన్నారు. ఇలా పవన్ తనకు మద్దతు తెలపడంతో రఘురామ ధన్యవాదాలు తెలిపారు.