
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్తో పాటు, రాష్ట్రాల్లోని అసెంబ్లీలలో పోలింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి ఓటు వేశారు. సీఎం వైఎస్ జగన్ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత.. స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటు వేశారు. అనంతరం మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక, పోలింగ్ ప్రారంభానికి ముందు వైసీపీ సభ్యులకు మాక్ పోలింగ్ ఏర్పాటు చేశారు.
ఇక, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ముందుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బృందంగా శాసనసభ కార్యాలయానికి చేరుకుని ఓటింగ్లో పాల్గొననున్నారు.
ఇక, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు రెండు కూడా.. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ఎన్నికల ఈ నెల 21న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఇప్పటివరకు పార్టీల మద్దతు సమీకరణాలను పరిశీలిస్తే.. ద్రౌపది ముర్ముకు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక, రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు. ఇందులో పార్లమెంటు ఉభయ సభలు, అన్ని రాష్ట్రాల శాసనసభల సభ్యులు.. అలాగే ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఓటు విలువ వేర్వేరుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు పింక్ బ్యాలెట్ పేపర్లను ఈసీ అందుబాటులో ఉంచింది.