చంద్రబాబు, జగన్, పవన్ కుటుంబ సభ్యుల ఓటు మా పార్టీకే : మేనిఫెస్టో విడుదల చేసిన కేఏ పాల్

By Nagaraju penumalaFirst Published Feb 16, 2019, 8:28 PM IST
Highlights

తన పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రపంచంలోనే ఎవరూ రూపొందించలేరన్నారు. మేనిఫెస్టోపై సీఎం అభ్యర్థి ఎవ‌రితోనైనా చ‌ర్చకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు. తన మేనిఫెస్టో చూశాక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ల కుటుంబ సభ్యులు కూడా తమ పార్టీకే ఓటేస్తారని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల సమరానికి సై అంటోంది ప్రజాశాంతి పార్టీ. అన్ని పార్టీల కంటే ముందే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. 

తాజాగా ఎన్నికల సమరంలో మరో ముందడుగు వేవారు కూడా. అధికార ప్రతిపక్ష పార్టీల కంటే ముందే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. శనివారం విజయవాడలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కేఏ పాల్ తమ పార్టీ అధికారంలోకి వ‌స్తే గెలిచిన ఒక్కో నియోజ‌వ‌ర్గానికి రూ. 100 కోట్ల నిధులు ఇస్తానని స్పష్టం చేశారు. 

అలాగే రూ. 50 కోట్లతో సూప‌ర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. విశాఖ‌లో హెల్త్ సిటీ, కిలారు సంతోష‌మ్మ మెమోరియ‌ల్ ఆస్పత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రపంచంలో ఎవరూ ఇవ్వని హామీని కూడా ప్రకటించారు. హెలికాఫ్టర్ అంబులెన్స్ సేవ‌ల్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 

కార్పొరేట్ స్కూళ్లను నిర్మిస్తామని అలాగే 3లక్షల 10వేల మంది అనాధ పిల్లల‌కు ఉచిత విద్య అందజెయ్యనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రస‌వించిన వారికి రూ. 15 వేలతోపాటు కేఏ పాల్ కిట్ అందజెయ్యనున్నట్లు తెలిపారు. 

డ్వాక్రా మహిళలకు తొలిరోజే పూర్తి రుణమాఫీ చేస్తామని అర్హత గల మహిళలకు యాభై శాతం ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. రైతుల‌కు ఎకరానికి రూ.8 వేలు పంట సహాయంతోపాటు రూ. 5 ల‌క్షల జీవిత భీమా, 12 నెల‌ల్లో రైతుల రుణాల్ని వంద‌శాతం మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. 
తన పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రపంచంలోనే ఎవరూ రూపొందించలేరన్నారు. మేనిఫెస్టోపై సీఎం అభ్యర్థి ఎవ‌రితోనైనా చ‌ర్చకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు. తన మేనిఫెస్టో చూశాక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ల కుటుంబ సభ్యులు కూడా తమ పార్టీకే ఓటేస్తారని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. 

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను తీసుకొస్తానని అలాగే భారీగా నిధులు తెచ్చి తన సత్తా చూపిస్తాననని వెల్లడించారు. ఏపీలో ఇప్పటికే 100 స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ గెలుపు ఖాయమైపోయిందన్నారు. 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు కేఏ పాల్ స్పష్టం చేశారు. 

click me!