విశాఖ పెళ్లికూతురు మృతి కేసు : సృజన మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, నివేదికలో ఏం తేలనుందో..?

By Siva KodatiFirst Published May 13, 2022, 3:27 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖ పెళ్లికూతురు మృతి కేసులో సృజన మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి చేశారు వైద్యులు. విషాహారం తీసుకోవడం వల్లే చనిపోయిందని.. కాదు కాదు గన్నేరు పప్పు తీసుకోవడం వల్లే మరణించిందనే వాదనలు వినిపిస్తున్న వేళ.. పోస్ట్‌మార్టం నివేదికపై ఉత్కంఠ నెలకొంది. 

విశాఖలో నవ వధువు సృజన (vizag bride death) మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. ఆమె మృతిపై నిన్నటి నుంచి తెలుగు నాట అనేక అనుమానాలు రేకెత్తుతున్న సంగతి తెలిసిందే. సృజన హ్యాండ్ బ్యాగ్‌లో గన్నేరు పప్పు ఉండటంతో ఆత్మహత్య చేసుకుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే కుటుంబ సభ్యులు ఆ ప్రచారాన్ని ఖండించారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం సృజనకు లేదని.. ఆమెతో పాటు ఇరు కుటుంబ సభ్యుల పరస్పర అంగీకారంతో పెళ్లి కుదుర్చుకున్నారని చెబుతున్నారు. సృజనను చికిత్స నిమిత్తం మొదట చేర్పించిన ఆసుపత్రి వైద్యులు.. ఆమె గుర్తు తెలియని విషం తీసుకోవడం వల్ల చనిపోయిందని నివేదిక ఇచ్చారు. దీంతో పోస్ట్‌మార్టంలో ఏం తేలబోతుందనే దానిపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

మరోవైపు Srujana మరణానికి సంబంధించి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సృజన మొబైల్ కోసం పోలీసులు తల్లిదండ్రులను కోరారు. అయితే Mobileను ఆలస్యంగా పోలీసులకు సృజన కుటుంబ సభ్యులు ఇచ్చినట్టుగా సమాచారం. అయితే అందులో చాటింగ్స్, పోన్ కాల్స్ సమాచారం డిలీట్ చేసి ఉంది. ఈ ఫోన్‌లో మిస్డ్ కాల్స్ లిస్ట్ మాత్రమే ఉండడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సృజన ఫోన్లో ఉన్న సమాచారాన్ని సేకరించేందుకు టెక్ నిపుణులను సంప్రదించారు పోలీసులు. 

కాగా.. నాగోతు శివాజీ, సృజనలకు పెద్దలు పెళ్లి నిర్ణయించారు. బుధవారం రాత్రి 7 గంటలకు వివాహం జరగాల్సి వుంది. దీనికి సంబంధించి ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్  కూడా జరుపుకున్నారు. అంతలోనే ఈ దారుణం జరగడంతో కుటుంబ సభ్యలు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వధువు సృజన మృతదేహం నుండి నమూనాలను కూడా తీసి పరీక్షల కోసం పంపారు. ఆరోగ్య కారణాలతో వధువు తీసుకున్న మాత్రలు ఏమైనా వికటించాయా అనే కోణంలో కూడా వైద్యులు పరీక్షిస్తున్నారు. పెళ్లి పనుల్లో కూడా సృజన బిజిబిజీగా ఉందని బంధువులు చెబుతున్నారు.  మరోవైపు పెళ్లి రోజున కూడా ఆమె ఉల్లాసంగా , ఉత్సాహంగా గడిపిన క్షణాలను కుటుంబ సభ్యులు గుర్తు చేసుకొంటున్నారు.

అంతకుముందు బుధవారం ఉదయం పెళ్లి కుమార్తె సృజనకు (srujana) కడుపునొప్పి రావడంతో ఆమెను విశాఖలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. సృజనను పరిశీలించిన డాక్టర్లు .. టాబ్లెట్లు, ఫ్లూయిడ్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. అప్పుడు కూడా సృజన ఆరోగ్యంగానే వుందని.. కాసేపట్లో మాంగళ్య ధారణ జరగాల్సి వుండగా ఆమె అస్వస్థతకు గురైంది. జీలకర్ర , బెల్లం పెడుతుండగా సృజన పెళ్లి పీటలపైనే స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సృజన కన్నుమూసింది. డాక్టర్లు వెల్లడించిన అంశాలపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. 

click me!