
విశాఖ (visakhapatnam) జిల్లా నర్సీపట్నంలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు (chintakayala ayyanna patrudu) ఇంటికి మరోసారి పోలీసులు చేరుకున్నారు. ఏ క్షణమైనా అయ్యన్నను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు అయ్యన్నపాత్రుడి ఇంటికి భారీగా చేరుకున్నారు.
కాగా.. శుక్రవారం నల్లజర్లలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. సీఎం జగన్ పాలనలో అంతా దోపిడి మాత్రమే జరుగుతుందని ఆరోపించారు. భారతి సిమెంట్ ధర తెలంగాణలో కంటే ఏపీలో ఎక్కువగా ఉందన్నారు. చెత్తపై పన్ను వేసిన సీఎం జగన్ మాత్రమేనని మండిపడ్డారు. ఇసుకలో రూ. వేల కోట్ల దోపిడి జరుగుతుందని ఆరోపించారు. TDP నేతలపై ఎన్ని కేసులు పెట్టుకున్నా వెనక్కు తగ్గేది లేదన్నారు. రాష్ట్రంలో పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారన్నారు.
గతంలో కూడా అయ్యన్నపాత్రుడిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ స్వగ్రామంలో ఆయన విగ్రహావిష్కరణ సభలో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి న్యాయవాది వేముల ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు ఎష్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దళిత మంత్రి మేకతోటి సుచరితను, సీఎం వైఎస్ జగన్ ను అసభ్య పదజాలంతో దూషిస్తూ బహిరంగంగా సమావేశంలో మాట్లాడినందున అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని వేముల ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వేముల ప్రసాద్ ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడిపై సెక్షన్ 505(2), మహిళను కించపరిచేలా మాట్లాడినందుకు సెక్షన్ 509, సీఎంను దూషించినందుకు సెక్షన్ 294(బి)తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో నమోదైన కేసుల విషయంలో హైకోర్టు కు వెళ్లి అయ్యన్నపాత్రుడు ముందస్తు బెయిల్ తెచ్చుకొన్నారు.
ఇదిలా ఉంటే అయ్యన్నపాత్రుడిపై నమోదైన కేసులపై పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మెన్ ముళ్లపూడి బాపిరాజు తదితరులు స్పందించారు. నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ, టీడీపీ భారీ బైక్ ర్యాలీని చూసి ఓర్వలేని వైఎస్సార్సీపీ నేతలు తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్ల పూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తగ్గేదేలేదన్నారు. తమ కార్యకర్తలు జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.