కొడాలి నాని, డీజీపీలపై వివాదాస్పద వ్యాఖ్యలు: టీడీపీ నేత బుద్దా వెంకన్నపై కేసు

By narsimha lodeFirst Published Jan 24, 2022, 4:00 PM IST
Highlights

ఏపీ మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతం సవాంగ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న ఇంటికి సోమవారం నాడు మధ్యాహ్నం  పోలీసులు వచ్చారు. ఈ వ్యాఖ్యలపై పోలీసులు వివరణ కోరనున్నారు.బుద్దా వెంకన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

అమరావతి: ఏపీ మంత్రి కొడాలి నాని, DGP  గౌతం సవాంగ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్నపై విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు సోమవారం నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై బుద్దా వెంకన్న నుండి వివరణ తీసుకొనేందుకు పోలీసులు వచ్చారు. 

2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోతే  ప్రజలు kodali Naniని చంపుతారని టీడీపీ నేత Buddha Venkanna వ్యాఖ్యలు చేశారు. Chandrababu  ఇంటి గేటును తాకినా కూడా నాని శవాన్ని పంపుతామని కూడా ఆయన హెచ్చరించారు.   సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించిన క్యాసినో సందర్భంగా సుమారు రూ.250 కోట్లు చేతులు మారాయని ఆయన చెప్పారు. అయితే  ఇందులో డీజీపీ వాటా ఎంత అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలపై బుద్దా వెంకన్నను పోలీసులు ప్రశ్నించనున్నారు.   అయితే ఏం జరిగినా సిద్దమేనని బుద్దా వెంకన్న చెబుతున్నారు. అన్నింటికి తాను తెగించే ఉన్నానని వెంకన్న చెబుతున్నారు.చంద్రబాబు నాయుడిపై మంత్రి కొడాలి నాని ఇంత కాలం పాటు తీవ్ర పదజాలం ఉపయోగించి విమర్శలు చేస్తే ఎందుకు నోరు మెదపడం లేదని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. గుడివాడలో క్యాసినో నిర్వహిస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన అడిగారు.

అయితే  బుద్దా వెంకన్న ఇంటి లోపలికి పోలీసులు రాకుండా ఆయన అనుచరులు గేట్లు వేశారు. ఈ విషయం తెలుసుకొన్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, టీడీపీ నేత నాగుల్ మీరా తదితరులు బుద్దా వెంకన్న ఇంటికి వచ్చారు. . సీఎం జగన్ కు, వైసీపీకి వ్యతిరేకంగా బుద్దా వెంకన్నకు నినాదాలు చేశారు. 

బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో వున్న కొడాలి నాని  సంక్రాంతి పండగ  సందర్భంగా అసాంఘిక, అశ్లీల కార్యకలాపాలను నిర్వహించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఏర్పాటు చేసిన నిజనిర్దారణ కమిటీ గుడివాడ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారిని కే కన్వెన్షన్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు టీడీపీ నేతల పర్యటన సందర్భంగా గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 

ఇదిలా ఉంటే కొడాలి నాని మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తన ఫంక్షన్ హాల్ లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదని... జరిగినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాదు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని కొడాలి నాని సవాల్ చేశారు. అయితే ఈ సవాలుకు టీడీపీ నేతలు కూడా సై అంటున్నారు. కొడాలి నాని దమ్ముంటే తేల్చుకుందామంటూ తిరిగి సవాలు విసిరుతున్నారు. కొడాలి నాని ఫంక్షన్ హాల్‌లో క్యాసినో జరిగిందనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయిని చెబుతున్నారు. 

ఈ నెల 21న గుడివాడకు వెళ్లిన టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వెళ్లింది. కే కన్వెన్షన్ సెంటర్ వద్దకు వెళ్లకుండా టీడీపీ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.  నిజనిర్ధారణ కమటీలోని నేతలను అరెస్ట్ చేసిన తర్వాత  వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయంపై రాళ్లు, కుర్చీలతో దాడికి దిగారు. ఈ దాడిని టీడీపీ శ్రేణులు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఇరు వర్గాలపై పోలీసులు లాఠీచార్జీ  చేశారు.

click me!