300 మంది చుట్టుముట్టారు... మంత్రి రోజా సహాయకుడు ఫిర్యాదు, 28 మంది జనసేన నేతలపై కేసు

By Siva KodatiFirst Published Oct 16, 2022, 8:55 PM IST
Highlights

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడికి సంబంధించి 28 మంది జనసేన నేతలపై పోలీసులు ఫిర్యాదు చేశారు. మంత్రి రోజా సహాయకుడు దిలీప్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

విశాఖ విమానాశ్రయంలో వైసీపీ మంత్రులు జోగి రమేశ్, రోజా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై జరిగిన దాడి ఘటన ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. దీనిపై వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన దాడి ఘటనలపై మంత్రి రోజా సహాయకుడు దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు విమానాశ్రయం వద్ద దాడికి యత్నించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మెటల్‌తో చేసిన ఓ వస్తువు తగిలి తన తలకు గాయమైందని... ఈ దాడిలో 300 మంది జనసేన కార్యకర్తలు పాల్గొన్నట్లు దిలీప్ ఆరోపించారు. ప్రభుత్వ వాహనాలను, ఆస్తులను కూడా వారు ధ్వంసం చేశారని ఆయన ఫిర్యాదులో తెలిపారు. దీనిని విచారణకు స్వీకరించిన విశాఖ ఎయిర్‌పోర్ట్ పోలీసులు ఇప్పటి వరకు 28 మంది జనసేన నేతలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

మరోవైపు... జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ వద్ద ఉద్రిక్తతో చోటు చేసుకుంది. పవన్‌ను చూసేందుకు విశాఖ, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా జనసైనికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో అరుపులు, కేకలు, నినాదాలతో బీచ్ రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు జనసైనికులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. 

ALso REad:విశాఖలో ఏం జరుగుతోంది.. పవన్‌ కళ్యాణ్‌కు చంద్రబాబు ఫోన్, జనవాణికి మద్ధతు

అంతకుముందు పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. నేరస్తుడి చేతిలో అధికారంలో ఉంటే  ఇలానే  ఉంటుందని  రాష్ట్రంలో చోటు చేసుకున్న  పరిస్థితులపై  విమర్శించారు. విశాఖ పోలీసులు పవన్  కళ్యాణ్ కు ఆదివారం నాడు నోటీసులు అందించారు.  ఈ  నోటీసులు అందుకున్న తర్వాత   పవన్ కళ్యాణ్  మీడియాతో మాట్లాడారు. తాను విశాఖపట్టణానికి  రాకముందే  గొడవ  జరిగిందన్నారు. కానీ తాము రెచ్చగొట్టడంవల్లే గొడవ జరిగిందని పోలీసులు నోటీసులు  ఇవ్వడాన్ని  పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ప్రజల కోసం పోరాడితే నోటీసులు ఇచ్చారన్నారు.

సవాళ్లను ఎదుర్కొనేందుకు జనసేన సిద్దంగా ఉందన్నారు..ఎన్ని కేసులు  పెట్టినా, జైలుకు  వెళ్లేందుకు కూడా  తాము సిద్దంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు. గొంతెతొద్దు, ప్రశ్నించొద్దంటే  ఎలా అని ఆయన అడిగారు.  అడిగేవాళ్లు  లేరని ఇష్టానుసారం చేస్తున్నారని  జగన్ సర్కార్ పై  పవన్ కళ్యాణ్  మండిపడ్డారు. బలహీనుల విషయంలో  పోలీస్ శాఖ బలంగా పనిచేస్తుందన్నారు. ఎదురు దాడి చేసేవారి  విషయంలో  చాలా బలహీనంగా  పనిచేస్తుందని   ఆయన విమర్శించారు. ఉత్తరాంధ్ర దోపిడీని చూపిస్తామని  డ్రోన్లను నిషేధించారన్నారు.  రాజకీయాల్లో నేర చరిత్ర  గల నేతలు పోవాలంటే  ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

click me!