
అనంతపురం : అతడు ఆపదలో వున్నవారిని రక్షించే బాధ్యతాయుతమైన పోలీస్. ఓ ఆడబిడ్డకు తండ్రి కూడా. కాబట్టి ఎవరైనా ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తే తండ్రిలా కాపాడాలి... కానీ అతడే మృగంలా మారి ఓ అమ్మాయి కాటేసాడు. తన బిడ్డ అలనాపాలన చూసుకుంటున్న నిరుపేద బాలికపై కన్నేసిన సదరు పోలీస్ అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ అమానుష ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతానికి చెందిన రమేష్ కానిస్టేబుల్ కాగా అతడి భార్య ఎక్సైజ్ కానిస్టేబుల్. వీరికి ఓ ఆడపిల్ల సంతానం. భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగులే కావడంతో అనంతపురంలో నివాసముంటున్నారు. దీంతో పాపను చూసుకోడానికి తెలిసినవారి ద్వారా గుత్తి ప్రాంతానికే చెందిన ఓ బాలికను నియమించుకున్నారు. తమ ఇంట్లోనే వుంటూ కూతురి అలనాపాలన చూసుకుంటున్న బాలికపై రమేష్ కన్నుపడింది.
భార్య విధులకు వెళ్లినపుడు ఇంట్లోనే వుండి బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు కానిస్టేబుల్ రమేష్. ఇలా గత ఆరునెలలుగా బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చగా అబార్షన్ కూడా చేయించాడు. అత్యాచారం, అబార్షన్ విషయాలు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయంతో బాలిక ఎవరికీ చెప్పలేదు.
Read More తప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలతో.. యువకులతో మలం తినిపించి, కొట్టి, గ్రామంలో ఊరేగించి...
బాలిక నిస్సహాయ స్థితిని అలుసుగా తీసుకుని రమేష్ చిత్రహింసలకు గురిచేసేవాడు.లాఠీలతో కొడుతూ, గొంతుకు వైరు బిగించి నరకం చూపించేవాడు. రోజురోజుకు అతడి వికృత చేష్టలు ఎక్కువ కావడంతో భరించలేకపోయిన బాలిక ధైర్యంచేసి తనపై గతకొంతకాలంగా జరుగుతున్న అఘాయిత్యాల గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కూతుర్ని కానిస్టేబుల్ ఇంటినుండి వెంటనే తీసుకెళ్లిపోయారు.
బాలిక తల్లిదండ్రులు పోలీస్ ఉన్నతాధికారులను కలిసి కానిస్టేబుల్ రమేష్ పై ఫిర్యాదు చేసారు. దీంతో అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు టూటౌన్ పోలీసులు. కానిస్టేబుల్ రమేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.