టీడీపీ కార్యాలయాలపై దాడులు: మరో అరుగురి అరెస్ట్.. మిగిలిన వారి కోసం తీవ్ర గాలింపు

Siva Kodati |  
Published : Oct 24, 2021, 06:42 PM ISTUpdated : Oct 24, 2021, 06:43 PM IST
టీడీపీ కార్యాలయాలపై దాడులు: మరో అరుగురి అరెస్ట్.. మిగిలిన వారి కోసం తీవ్ర గాలింపు

సారాంశం

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో తాజాగా మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 16కి చేరింది. దాడి ఘటన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (Ys jagan) టీడీపీ (tdp) నేత కొమ్మారెడ్డి పట్టాభి (kommareddy pattabhi) చేసిన వ్యాఖ్యలు ఎంతటి కలకలం రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధానంగా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ 'బోసడీకే'... అన్నపదం ఏపీలో ఇప్పుడు అత్యంత చర్చనీయాంశమైంది. టీడీపీ నేత పట్టాభి గత మంగళవారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్‌ని ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాతనే వైసీపీ కేడర్ భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై అధికార పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడటం తెలిసిందే. వైసీపీ దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) 36 గంటల పాటు నిరసన దీక్ష చేశారు. దీనికి కౌంటర్‌గా వైసీపీ సైతం జనాగ్రహ దీక్షలకు దిగింది. 

కాగా.. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో తాజాగా మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 16కి చేరింది. దాడి ఘటన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మీడియా క్లిప్పింగ్స్ ఆధారంగా ఈ కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. తాజాగా అరెస్టయిన వారిలో కె. మోహన్ కృష్ణారెడ్డి, కాండ్రుకుంట గురవయ్య గుంటూరుకు చెందినవారు కాగా.... షేక్ బాబు, షేక్ సైదా, బంకా సూర్య సురేశ్, జోగరాజు విజయవాడకు చెందినవారు. ఈ కేసులో మిగతా నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 

Also Read:'బోసడీకే'... ఆ మాటకు తెలంగాణ పదకోశంలో అర్ధం ఇదే: అయ్యన్నపాత్రుడు

ఈ నెల 19న టీడీపీ ఆఫీసుతో పాటు ఆ పార్టీ నేత పట్టాభి ఇంటిపై వైసీపీ నేతల దాడికి సంబంధించి నిన్నటి నుంచి అరెస్ట్‌ల పర్వం  మొదలైంది. రెండు దాడులకు సంబంధించి విడివిడిగా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పది మందిని గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టాభి ఇంటిపై దాడికి సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 21 మందిని అదుపులో తీసుకున్నారు. ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని బాధితులను కోరారు. మరోవైపు టీడీపీ నేత పట్టాభికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన నిన్న రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Nara Lokesh Hilarious Comments On Varma | Asianet News Telugu