
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. పది లక్షల మంది ఔట్ పేషెంట్ల మైలురాయిని చేరుకున్నందున మోడీ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇటీవలి మన్కీ బాత్ రేడియా కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ఎయిమ్స్ వైద్యుడితో, టెలి కన్సల్టేషన్ ద్వారా వైద్య సలహా పొందిన రోగితో జరిపిన సంభాషణను వివరించారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా సైతం ఎయిమ్స్ మంగళగిరికి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. సమాజానికి, మానవాళికి, దేశానికి ఇలాగే సేవలు చేయాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు.
2019 మార్చి 12న 44 మందితో ఎయిమ్స్ ఓపీ సేవలు ప్రారంభించింది. సోమవారం ఓపీ సేవలు పొందిన వారి సంఖ్య 10 లక్షలు దాటింది. ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్రం రూ 1681 కోట్లు కేటాయించింది. ఇందులో 98 శాతం వరకు నిర్మాణాలు పూర్తవ్వగా.. మరో 17 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రావాల్సి వుంది. కోవిడ్ సమయంలో మంగళగిరి ఎయిమ్స్ విశేష సేవలు అందించింది. ఆ సమయంలో వార్డులు, క్వారంటైన్ సెంటర్లు రోగులతో నిండిపోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాయే కాకుండా ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి ప్రతినిత్యం భారీగా రోగులు తరలివస్తున్నారు. ఇక్కడ ఓపీ ఫీజు రూ.10 మాత్రమే. అనుభవజ్ఞులైన వైద్యులతో పాటు ఎంబీబీఎస్ విద్యార్ధులు ఇక్కడ సేవలు అందిస్తున్నారు.