అనంతపురంలో దారుణం.. ఆధార్ లో ఫొటో మార్చి.. రూ.30కోట్ల భూములు కొట్టేశారు...

Published : Aug 25, 2022, 10:30 AM IST
అనంతపురంలో దారుణం.. ఆధార్ లో ఫొటో మార్చి.. రూ.30కోట్ల భూములు కొట్టేశారు...

సారాంశం

ఆధార్ కార్డులో ముఖం మార్చేసి ఓ వ్యక్తికి చెందిన కోట్ల విలువైన భూమిని కొట్టేశారు. అయితే ప్లాన్ ప్లాప్ అవ్వడంతో అడ్డంగా దొరికిపోయారు. అనంతపురంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 

అనంతపురం : ఆధార్ లో ముఖం మార్చేశారు. భూ యజమానిని ఏమార్చారు. ఏకంగా రూ.30కోట్ల విలువైన భూములు కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. ఆ తర్వాత అడ్డంగా దొరికిపోయారు. అనంతపురం జిల్లాలో కలకలం రేపిన ఈ వ్యవహారంలో టీవీ ఛానల్స్ కు చెందిన విలేకరులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనంతపురం నగరంలోని వెంకటసుబ్బయ్యకు అనంతపురం రూరల్ మండలం పరిధిలోని రాచానపల్లి సమీపంలో సర్వేనెంబర్- 127లో 14.96 ఎకరాల భూమి ఉంది. స్థానిక విలేకరి హనుమంతు, రిపోర్టర్ రమేష్, పాత్రికేయుడు వేణుగోపాల్, ఓప్రముఖటీవీ ఛానల్ కార్ డ్రైవర్ రామ్ మోహన్ రావుల కన్ను వీటిపై పడింది. 

ఆ భూమి విలువ ఎకరం రెండు కోట్ల రూపాయలు. ఎలాగైనా ఈ భూములను కాజేసి సొమ్ము చేసుకోవాలని వీరంతా పథకం అమలు చేశారు. వెంకట సుబ్బయ్య ఆధార్ కార్డు సంపాదించారు. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన వడ్డె వెంకటరాయుడు అనే వ్యక్తి ముఖం, పేరుతో ఆ ఆధార్ ను అప్డేట్ చేశారు. భూమి అమ్మకంలో కూడేరు మండలం జయపురం గ్రామానికి చెందిన అంపగాని శ్రీనివాసులు సహకారం తీసుకున్నారు.  తమ సమీప బంధువు సత్యమయ్య పేరుతో ఆ భూమిని మొదట రిజిస్ట్రేషన్ చేయించారు.  ఆ తర్వాత వీరు పెద్దవడుగూరు మండలానికి చెందిన దేవేంద్ర రెడ్డి అనే రియల్టర్ను కలిశారు. 

కేసీఆర్ తో స్నేహం పక్కన పెట్టి బకాయిలు వసూలు చేయాలి: జగన్ ను కోరిన టీజీ వెంకటేష్

భూమిని అతనికి అమ్మేందుకు సిద్ధమయ్యారు. 2 కోట్ల విలువ చేసే ఈ భూములను రూ. కోటి చొప్పున ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నారు. రూ.1.05 కోట్లు అడ్వాన్స్గా తీసుకుని విక్రయ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. ఇంతలో అసలు యజమాని వెంకటసుబ్బయ్య ఇంటికి మార్పులు చేర్పులతో ఎన్ రోల్మెంట్ పూర్తయిన ఆధార్ కార్డు వచ్చింది. కొత్త కార్డు ఇంటికి రావడం, తన ఫోటో స్థానంలో మరొకరి ఫోటో ఉండడంతో వెంకటసుబ్బయ్య ఆశ్చర్యపోయాడు. ఆ విషయాన్ని తన కుమారుడు నందకిషోర్ తెలిపాడు. దీనిపై ఈనెల 7న స్పందనలో అనంతపురం జిల్లా ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. 

రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా,  భూ భాగోతం గుట్టురట్టయింది. అంపగాని శ్రీనివాసులు, సత్యమయ్యను  అరెస్టు చేసిన పోలీసులు వారిచ్చిన వివరాలతో బత్తల శేఖర్, అచ్చుకట్ల ఇంతియాజ్, కర్తనపర్తి సురేష్ను  21న అరెస్టు చేశారు. ఆధార్ మార్కింగ్ లో వీరు సహకరించారని గుర్తించారు. వారిని విచారించడంతో విలేకరుల బాగోతం బయటపడింది. వారిని బుధవారం అనంతపురం ఎక్సైజ్ కోర్టులో హాజరుపరచగా, వచ్చేనెల 6 వరకు రిమాండ్ విధించారు. నిందితులను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. అయితే, కోర్టు వద్ద పోలీసులు నిందితుల ఫొటోలు తీయనివ్వలేదు. 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu