Phone Tapping: ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ కలకలం! నారా లోకేష్ కు ఆపిల్ హెచ్చరిక !!

By Rajesh KarampooriFirst Published Apr 12, 2024, 3:28 PM IST
Highlights

Phone Tapping: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గుబులు రేపుతున్న అంశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. అధికార,ప్రతిపక్షాల నడుమ హాట్ టాఫిక్ గా మారింది. తాజాగా విషయం ఏపీ రాజకీయాల్లో కూడా తీవ్ర కలవరాన్ని రేపుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh) ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా ఆపిల్ సంస్థే నారా లోకేష్‌కి తెలిపిందట.  
 

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కాదు.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలను కూడా షేక్ చేస్తోంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh) ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా ఆపిల్ సంస్థే నారా లోకేష్‌కి తెలిపింది. తన ఫోన్‌ను గుర్తు తెలియని సాఫ్ట్ వేర్‌లతో ఫోన్‌ను హ్యాకింగ్, ట్యాపింగ్ చేయడానికి ప్రయత్నించడానికి కుట్ర జరుగుతుందని, ఫోన్ ట్యాపింగ్, హ్యాంకింగ్‌కి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ  లోకేష్ కు ఆపిల్ సంస్థ ఈమెయిల్ పంపింది. ఎన్నికల వేళ ఈ వార్త  ఏపీలో తీవ్ర కలవరాన్ని రేపుతోంది.

అప్రమత్తమైన తెలుగుదేశం పార్టీ (TDP) ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) దృష్టికి తీసుకెళ్లింది. తన యువనాయకుడు నారా  లోకేష్ ఫోన్‌ను హ్యాకింగ్,  ట్యాపింగ్ చేయడానికి కుట్ర జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంధ్ర కుమార్ ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని ఏజెన్సీలు నారా లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు ఆపిల్ సంస్థ (ఐఫోన్) హెచ్చరినట్టు తెలిపారు. ఇలాంటి హెచ్చరికలు 2024 మార్చిలో కూడా లోకేష్ వచ్చాయని తెలిపారు. 

ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీకి ఏపీ రాష్ట్ర డీజీపీ రాజేంధ్రనాధ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇప్పటికే అనేక మార్లు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకవెళ్లింది టీడీపీ. తమ పార్టీ నేతలపై  రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లు వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత రెండేళ్లుగా డీజీపీ గా  విధులు నిర్వర్తిస్తున్న  రాజేంద్రనాధ్ రెడ్డి నియామకం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని అన్నారు. అలాగే.. పీఎస్‌ఆర్ ఆంజనేయులు కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వైసీపీకి ఏజెంట్ గా మారారని 
ఆరోపణలు చేశారు. సాధారణ ఎన్నికల నేపధ్యంలో ఏపీ పోలీసులు అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనీ, వారిపై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కనకమేడల రవీంద్ర కుమార్ లేఖలో వివరించారు. 

ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్‌కి పాల్పడింది వైసీపీ ప్రభుత్వమేనని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫోన్లు జగన్ ప్రభుత్వం ఎప్పటి నుంచో ట్యాప్ చేస్తోందని  టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, అసలు సూత్రధారులను బయటకు లాకుతామని టీడీపీ నేతలు అంటున్నారు. తన ప్రభుత్వంపై  ప్రజల్లో నమ్మకం కోల్పోవడంతో.. జగన్ ఫోన్ ట్యాపింగ్‌పై నమ్మకం పెట్టుకున్నాడంటూ తెలుగు దేశం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

click me!