
ప్రభుత్వ కార్యాలయాల్లో (govt office) ఉత్తర ప్రత్యుత్తరాలు, ఉత్తర్వులు అన్నీ తెలుగులోనూ (telugu) జారీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో (ap high court) పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు కేవలం 13 శాతం మందికి అర్థమయ్యే ఆంగ్లంలో జరుగుతున్నాయన్న పిటిషనర్ పేర్కొన్నారు. అందుకే అధికార భాషా చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. అలాగే ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను తెలుగులో నిర్వహించేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దీనితో పాటు అధికార భాష పర్యవేక్షణ అధికారులను నియమించేలా ఆదేశించాలని శ్రీనివాస్ అభ్యర్తించారు. 2017లో తీసుకొచ్చిన ఏపీ పర్యాటక, సాంస్కృతిక చట్టానికి అనుగుణంగా తెలుగు భాషాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగును అధికార భాషను వినియోగించాలని, గతంలో తీసుకువచ్చిన జీవోలను అమలు చేయాలని కోరుతూ ఈ ఏడాది మార్చి, సెప్టెంబర్ నెలల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శికి వినతి పత్రం సమర్పించినట్లు శ్రీనివాస్ తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.
ALso Read:ఏపీ : ఆన్లైన్ మూవీ టికెట్లపై జీవో విడుదల..పేటీఎం, బుక్ మై షోలకు ఇక చెక్
సీఎస్తో సహా సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్య దర్శి, ఏపీ యువత అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు . ప్రజలకు అర్థమయ్యే భాషలో దస్త్రాలు నిర్వహించకపోవడం ఇబ్బందికరంగా మారిందన్నారు. సర్కార్ పాలనకు సంబంధించిన అంశాలు, కార్యనిర్వహణ నిర్ణయాలు, జీవోలు, ప్రజా సమస్యలపై తీసుకునే ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందని ఆయన పిటిషన్లో చెప్పారు.