బలంగా మూడు పార్టీలు.. టీడీపీతో జనసేన కలిస్తే వార్ వన్ సైడేనా, ఆసక్తికరంగా పెద్దాపురం రాజకీయాలు

Siva Kodati |  
Published : May 20, 2023, 04:58 PM IST
బలంగా మూడు పార్టీలు.. టీడీపీతో జనసేన కలిస్తే వార్ వన్ సైడేనా, ఆసక్తికరంగా పెద్దాపురం రాజకీయాలు

సారాంశం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని టీడీపీ, వైసీపీ, జనసేన నేతలు పావులు కదుపుతూ వుండటంతో పెద్దాపురంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.   

మరో ఏడాదిలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే నిధుల సమీకరణ, అభ్యర్ధుల ఎంపిక, వ్యూహ రచనలపై మునిగిపోయారు. అలాగే సీఎం జగన్‌తో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిత్యం జనంలో వుంటున్నారు. అయితే ప్రతిపక్ష టీడీపీ.. వైసీపీ కంటే ముందే కదన రంగంలోకి దూకింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. ఇక రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఒక్కో చోట ఒక్కో రాజకీయం వుంటుంది. సామాజిక సమీకరణాలు, ఇతర అంశాలు వుంటాయి. ఈ నేపథ్యంలో పెద్దాపురం నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారోనని స్థానికంగా చర్చ జరుగుతోంది.

ఇక్కడ కాంగ్రెస్ , టీడీపీలు ఆరుసార్లు, సీపీఐ రెండు సార్లు, పీఆర్‌పీ ఒకసారి గెలిచింది. గత ఎన్నికల్లో జగన్ సునామీని సైతం తట్టుకుని ఇక్కడ టీడీపీ అభ్యర్ధి, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పే విజయం సాధించారు. అయితే పురపాలక ఎన్నికల నాటికి ఇక్కడ అధికార పార్టీ బాగా పుంజుకుంది. ఏకంగా పెద్దాపుపరం, సామర్లకోట మున్సిపాలిటీలను సొంతం చేసుకుంది. ఇక్కడ కాపుల ప్రాబల్యం అధికం కాగా.. కమ్మ సామాజిక వర్గానికి పాతిక వేల ఓట్ల వరకు వుంటాయి. దీంతో ఈ రెండు కులాలే పెద్దాపురం రాజకీయాలను శాసిస్తున్నాయి. 

సిట్టింగ్ ఎమ్మెల్యే చినరాజప్ప.. వరుసగా ఇక్కడి నుంచి గెలిచారు. అంతేకాదు.. తెలుగుదేశం ప్రభుత్వం వున్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. దీంతో ఆయనే మళ్లీ గెలుస్తారని ఇక్కడ తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. చినరాజప్పకే టికెట్ ఇస్తానని చంద్రబాబు ఇటీవల పెద్దాపురం పర్యటన సందర్భంగా ప్రకటించారు. అందరినీ కలుపుకుపోవడం, వివాదరహితుడు కావడంతో ఆయన గెలుపే ఖాయమేననే చర్చ కనిపిస్తోంది. అన్ని నియోజకవర్గాల మాదిరే ఇక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు తనయుడు, గుణ్ణం చంద్రమౌళి వర్గాలు అసమ్మతితో వున్నాయి. అయితే ఎన్నికల నాటికి వీరికి అధిష్టానం చెక్ పెట్టే ఆలోచనలో వుంది. 

ఇక వైసీపీ విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో మాజీ ఎంపీ తోట నరసింహం సతీమణి తోట వాణి ఇక్కడి నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే ఆ తర్వాత ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరు. ఇదే సమయంలో గతంలో వైసీపీ టికెట్ ఆశించి భంగపడిన దవులూరి దొరబాబును ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించడంతో ఆయన యాక్టీవ్ అయ్యారు. దొరబాబు రాకతో కేడర్‌లో జోష్ నెలకొంది. ఏపీ హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్ హోదాలో ఆయన ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. ఎమ్మెల్యే కాకపోయినా అధికార పార్టీలో కీలక హోదాలో వుండటంతో దొరబాబు పెద్దాపురంలో అంతా తానై వ్యవహరిస్తున్నారు. అయితే దొరబాబుకు పదవులు దక్కడంతో ఆయన అసమ్మతి వర్గం భగ్గుమంటోంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తున్నారని వారు అలకబూనారు. అంతేకాదు.. దొరబాబుకు టికెట్ ఇస్తే ఓడిస్తామని వారు బహిరంగంగానే చెబుతున్నారు. ఈసారి సామర్లకోట జడ్పీటీసీ వీరం రెడ్డి కూడా వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు. మరి వీరిలో ఎవరిని అధిష్టానం కరుణిస్తుందో చూడాలి. 

కాపుల ప్రాబల్యం వున్న నిజయోకవర్గం కావడంతో ఇక్కడ జనసేన కూడా బలంగానే వుంది. గత ఎన్నికల్లో ఈ పార్టీ నుంచి తుమ్మల రామస్వామి అలియాస్ బాబు పోటీ చేశారు. ఈయన పార్టీ కార్యక్రమాల్లో అంటిముట్టనట్లుగా వుంటున్నారు. కేవలం పవన్ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో జనసేనకు 25 వేల వరకు ఓట్లు పడగా.. కాపుల ఓట్లు చిలీపోయాయి. దీంతో జనసేన-టీడీపీ గనుక పోటీ చేస్తే.. ఇక్కడ తెలుగుదేశం గెలుపును అసాధ్యమనే భావన వినిపిస్తోంది. మూడు పార్టీలు బలంగా వున్న నేపథ్యంలో ఒక వేళ విడివిగా పోటీ చేసినా ఇక్కడ ముక్కోణపు పోరు తప్పదని విశ్లేషకులు అంటున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

పరాభవ నామ సంవత్సరం అంటే అర్థం ఇదే | CM Chandrababu Participates in Ugadi | Asianet News Telugu
ఉగాది వేడుకల్లో జగన్ దంపతులు | YS Jagan Attends Ugadi Panchanga Sravanam 2026 | Asianet News Telugu