ఎఫ్డీఐల విషయంలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనుకబడిపోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు దేశంలోనే టాప్ 5లో వున్న ఏపీ.. ఇప్పుడు 14వ స్థానానికి పడిపోయిందన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శిలు గుప్పించారు. ఒకప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)లను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని టాప్ 5 రాష్ట్రాల్లో ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఎఫ్డీఐలను రాబట్టడంలో రాష్ట్రం వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశంలో ఈ విషయంలో ఏపీ 14వ ర్యాంక్లో వుందన్నారు.
ఏపీలో పెట్టుబడుల విషయంలో పెట్టుబడిదారుల్లో భరోసా కలగడం లేదన్నారు. దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా వున్న జగన్.. తన సంపద పెంచుకోవడంపైనే తపనపడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎఫ్డీఐల విషయంలో జగన్ పూర్తి నిర్లక్ష్యంగా వుంటున్నారని.. వీటి వల్ల రాష్ట్ర యువతకు ఉద్యోగాలు వస్తాయన్న విషయం తెలిసి కూడా జగన్ పట్టించుకోవడం లేదన్నారు.
ALso Read: రూ.2000 నోటు ఉపపంహరణ .. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఏమన్నారంటే..?
అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి రోజా. శనివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన వాలంటీర్లకు వందన కార్యక్రమంలో రోజా పాల్గొని ప్రసంగించారు. పేదలకు ఇచ్చే సెంటు స్థలాన్ని చంద్రబాబు సమాధులతో పోల్చడాన్ని ఆమె తప్పుబట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175కి 175 స్థానాల్లో గెలుస్తుందన్నారు.
వరుసగా మూడోసారి వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా వుందని ఆమె పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థతో జగన్ పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని రోజా ప్రశంసించారు. ప్రజలు కూడా వాలంటీర్లను మెచ్చుకుంటుంటే.. చంద్రబాబు మాత్రం విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రోజా ప్రశంసించారు.