ఫాతిమా కాలేజీ విద్యార్ధుల సమస్యలపై జనేసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. విజయవాడలో ఆమధ్య వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న పవన్ మంగళవారం ట్విట్టర్ ద్వారా మరోసారి స్పందించారు. మానవతా దృక్పధంతో విద్యార్ధుల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టిపెట్టి ఆదుకోవాలంటూ చంద్రబాబునాయుడును ట్విట్టర్లో కోరారు. ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కలిసే తమ జీవితాలపై దెబ్బకొట్టారంటూ ఒకవైపు విద్యార్ధులు మొత్తుకుంటుంటే పవనేమో సమస్యను పరిష్కరించమంటూ మళ్ళీ సిఎంనే కోరటం గమనార్హం.
బాధ్యతారాహిత్యమైన, అనాలోచిత, అత్యాశ కలిగిన మేనేజ్మెంటే అందుకు కారణమని పవన్ ఆరోపించారు. ప్రతిభావంతులైన విద్యార్థులు ఎంతో బాధతో చేసిన విన్నపాలను కేంద్ర, రాష్ట్రాలు గుర్తించకుండా కాలయాపన చేశాయని మండిపడ్డారు. ఫాతిమా మెడికల్ కళాశాలలో జరిగినట్లు విదేశాల్లో జరిగితే భారీగా జరిమానా విధించడంతో పాటు, అనుమతులను రద్దు చేసి, మేనేజ్మెంట్ను జైలుకు పంపేవాళ్లం’’టూ మండిపడ్డారు. కానీ, ‘మనదేశంలో సామాన్యులు, నిస్సహాయులపై వేగంగా పనిచేసే చట్టం, అధికారం, అంగబలం ఉన్న వారి విషయంలో సమర్థంగా, వేగవంతంగా పనిచేయటం లేద’ని అభిప్రాయపడ్డారు.
వచ్చే ఎన్నికల సన్నాహాల్లో పడి ప్రభుత్వాలు ప్రస్తుత విద్యావ్యవస్థ ప్రక్రియను, విద్యార్థుల భవిష్యత్ను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులు ఎంతో విలువైన సమయాన్ని డబ్బును ఇప్పటికే కోల్పోయారు. తమ స్వేదాన్ని, రక్తాన్ని చిందించి విద్యార్థుల చదువు కోసం ఫీజులు కట్టిన తల్లిదండ్రులకు ఇప్పుడు ఓదార్పు కావాలి. అయితే ఈ విషయంలో మేనేజ్మెంట్ నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తోంది. దయచేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడండి’ అంటూ పవన్ వరుస ట్వీట్లు చేశారు.