అవసరానికి వాడుకుని వదిలేశారట

First Published Mar 7, 2018, 4:33 PM IST
Highlights
  • ‘టిడిపి-బిజెపి పెద్దలు తనను అవసరానికి వాడుకుని వదిలేశారం’టూ భోరుమన్నారు.

పవన్ కల్యాణ్ కు ఇంత కాలానికి జ్ఞానోదయం అయినట్లుంది. అవసరానికి వాడుకుని వదిలేయటంలో చంద్రబాబునాయుడు ఎంతటి ఘనుడో ఇంతకాలానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు తెలిసొచ్చింది. బుధవారం మీడియాతో పవన్ మాట్లాడుతూ, ‘టిడిపి-బిజెపి పెద్దలు తనను అవసరానికి వాడుకుని వదిలేశారం’టూ భోరుమన్నారు. 2014 ఎన్నికల్లో తన అవసరం తీరిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి తనను వదిలేసినట్లుగానే తాను ఫీల్ అవుతున్నట్లు చెప్పారు.

ఇంతకీ పవన్ ఇపుడీ విషయం ఎందుకు చెప్పారో మాత్రం ఎవరికీ అర్ధం కాలేదు. ఒకవైపేమో యావత్ రాజకీయపార్టీలన్నీ పవన్ ను ప్యాకేజీ స్టార్ గా ఆడిపోసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. తన వ్యవహారశైలితో అదే నిజమన్నట్లు పవన్ కూడా వ్యవహరిస్తున్నారు. మరి, ఇంతలో చంద్రబాబుతో పవన్ కు ఎక్కడ చెడిండో అర్ధం కావటం లేదు. పైగా తనను రాజకీయాల్లో చిన్న పిల్లోడిని చూసినట్లుగా చూస్తున్నారంటూ వాపోయారు. తనపై ఐటి అధికారులను కూడా ఉసిగొల్పారట.

ప్రత్యేకహోదా ఉద్యమాల్లో, ఆందోళనల్లో ప్రజల భాగస్వామ్యం ఉండటం లేదని తెగ ఫీలైపోయారు. రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించకుండా చిల్లరగా వ్యవహరిస్తున్నట్లు మండిపడ్డారు. అసలు కేంద్రంతో గొడవలు పెట్టుకోవద్దని రాష్ట్రప్రభుత్వం ఎందుకు అనుకుంటోందో తనకు అర్ధం కావటం లేదన్నారు. ఈ దశలో కేంద్రమంత్రులుగా టిడిపి వాళ్లు రాజీనామాలు చేసినా ఉపయోగం ఉండదని పవన్ అభిప్రాయపడ్డారు.

ఇంత చెప్పిన పవన్ వచ్చే ఎన్నికల్లో తన స్టాండ్ ఎలా ఉండబోతోందో 2019లోనే చెబుతానన్నారు. దక్షిణాది ఉద్యమం తొండ ముదిరి ఊసరవెల్లిలాగ ముదురుతోందన్నారు. 14వ తేది గుంటూరు సభలో తన కార్యాచరణ చెబుతానని అన్నారు. అన్నీ ప్రశ్నలకు అదే రోజు సమాధానం చెబుతానని పవన్ ప్రకటించారు.

 

 

click me!