
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్టుగా జనసే పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అకాల వర్షాలతో పంటలు కోల్పోయి నష్టాల పాలైన రైతులను ఆయన పరామర్శించనున్నట్టుగా పేర్కొంది. ఇందుకోసం పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం రాజమండ్రి చేరుకోనున్నారు. అనంతరం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్నారు. కడియంలో రైతులతో సమావేశం కానున్నారు.
పవన్ కల్యాణ్ పర్యటన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల మీదుగా సాగనుందని జనసేన పార్టీ తెలిపింది. ఈ పర్యటనలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్తో పలువురు నాయకులు పాల్గొననున్నారని పేర్కొంది.
ఇదిలా ఉంటే.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పవన్ కల్యాణ్ ఇటీవల డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు. నష్టాన్ని అంచనా వేసి త్వరగా రైతులకు సాయం అందించాలని కోరారు. ప్రకృతి విపత్తులలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు జనసేన ప్రభుత్వం రాగానే ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని చెప్పారు.