అమరావతిలో రాజధాని గురించి భూసేకరణ చేస్తారని ముందుగా తెలిసుంటే తెలుగుదేశానికి మద్ధతునిచ్చేవాడిని కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
అమరావతిలో రాజధాని గురించి భూసేకరణ చేస్తారని ముందుగా తెలిసుంటే తెలుగుదేశానికి మద్ధతునిచ్చేవాడిని కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇవాళ ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉండవల్లిలో రైతులతో కలిసి పంటలు పరిశీలించారు. అనంతరం వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడుతూ.. అమరావతి కోసం అవసరానికి మించి భూసేకరణ జరుగుతోందని.. ఇకపై భూసేకరణ చేస్తే ఎదురు తిరగాలని రైతులకు పిలుపునిచ్చారు.
భూసేకరణ జరిగితే తనకు చెప్పాలని.. తాను కూడా మీతో పాటు వచ్చి ఆందోళనలో పాల్గొంటానని తెలిపారు.. అయినప్పటికీ పొలాలు బలవంతంగా లాక్కోవాలని చూస్తే.. ప్రాణాలివ్వడానికి కూడా ముందుంటానని చెప్పారు. పంట భూములను బీడు భూములుగా చూపించడం దారుణమన్నారు.. అధికారులను, పోలీసులను వ్యతిరేకభావంతో చూడవద్దని.. వారు ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసేవారు మాత్రమేనని పవన్ ప్రజలకు సూచించారు..
చావులు, ఏడుపులతో రాజధాని వద్దని.. రైతులను ఏడిపిస్తే నాశనమవుతారని జనసేనాని అన్నారు.. ప్రభుత్వాలు భూదాహాలను తగ్గించుకోవాలని.. సంపద కొద్దిమంది చేతుల్లో మాత్రమే ఉండటాన్ని జనసేన సహించదని హెచ్చరించారు... రాజ్యాంగం అందరికీ సమాధానమేనని.. రైతులు వారి పొలాల్లోకి వెళ్లడానికి ఆధార్ చూపించాల్సి రావడం దారుణమని పవన్ అన్నారు.